ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. 15 మంది మృతి..

Wait 5 sec.

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది . ఫలోడి జిల్లాలోని మటోడా గ్రామం వద్ద టెంపో.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో 15 మంది చనిపోయినట్లు తెలిసింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. యాత్రికులను తీసుకెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్‌కు చెందిన వీరంతా.. బికనీర్‌లోని కొలాయత్ ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోధ్‌పూర్‌ వెళ్తున్న టెంపో ట్రావెలర్ మటోడా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రైలర్‌ను (ట్రక్కు) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్ వేగంగా ఢీకొనటంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జైంది. దీంతో ముందు కూర్చున్నవారిలో ఎక్కువ మంది చనిపోయినట్లు తెలిసింది. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని గమనించి.. టెంపోలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ఫలోడి రోడ్డు ప్రమాదంపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ స్పందించారు. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్, ఇతర సీనియర్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ప్రమాదంలో 15 మంది మరణించారని అధికారులు చెప్తున్నారు. గాయపడిన వారికి సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి చికిత్స కోసం జోధ్‌పూర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. ఫలోడి రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాహనం పార్కింగ్ సరిగ్గా లేకపోవడం, నిలిపి ఉంచిన వాహనం సరిగ్గా కనిపించకపోవటం కూడా కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో బస్సులో మంటలు చెలరేగగా.. బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రైవేట్ బస్సులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ ఘోర ప్రమాదాన్ని మరిచిపోకముందే రాజస్థాన్‌లో ప్రమాదం జరిగి 15 మంది చనిపోయారు.