సాధారణ ప్రజలనే కాకుండా చదువుకున్న వారిని, ఉద్యోగాలు చేసే వారిని మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. తాజాగా బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బురిడీ కొట్టించిన ఓ సైబర్ కేటుగాడు.. ఏకంగా రూ. లక్ష కాజేశాడు. అది సైబర్ మోసమని గుర్తించిన ఎమ్మెల్యే పల్లా.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఆదివారం ఉదయం ఒక వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. అతడు తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్నాడు. తన పేరు అనంతరామిరెడ్డి అని.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్‌ భారత్‌ పథకం కింద అర్హులైన వారికి రూ.10 లక్షల వరకు లోన్లు వస్తాయని చెప్పి నమ్మించాడు. జనగామ నియోజకవర్గంలో ఒక 40 మంది అర్హుల లిస్ట్ పంపిస్తే.. వారికి వెంటనే రుణాలు మంజూరు చేయిస్తానని చెప్పాడు. అయితే అది నిజమని నమ్మిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. అతడు చెప్పింది విన్నారు. ఈ క్రమంలోనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్ డేట్ అంటూ చెప్పాడు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.2,500 చొప్పున మొత్తం 40 మందికి ప్రాసెసింగ్‌ ఫీజు కింద.. రూ.1 లక్ష చెల్లించాలని ఆ సైబర్ నేరగాడు సూచించాడు. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం కింద తన నియోజకవర్గంలోని ప్రజలకు లబ్ధి చేకూరుతుందని భావించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రూ.1 లక్షను ఫోన్‌ పే ద్వారా ఆ వ్యక్తి అడిగిన నంబర్‌కు పంపించారు. ఇక కొద్దిసేపటి తర్వాత డబ్బులు రాలేదని.. మరోసారి పంపించాలని ఆ వ్యక్తి అడగడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుమానం కలిగింది. దీంతో అసలు అతడు నిజమైన ప్రభుత్వ ఉద్యోగేనా అని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ఒక సైబర్ మోసగాడని గ్రహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి.. వెంటనే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ సైబర్ మోసగాడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.