తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతోంది. ఏప్రిల్ 23వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇటు అధికార డీఎంకే కూటమి, అటు అన్నాడీఎంకే కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. సినీ నటుడు విజయ్ టీవీకే పార్టీ కూడా తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ.. అన్ని రాజకీయ పార్టీలు, నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో సభలను రద్దు చేస్తూ ఉండటం చర్చనీయాంశమైంది. మార్చి 15వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన నాటి నుంచి విజయ్ అనేక కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. అయితే పోలీసుల అనుమతి ఇవ్వకపోవటంతో రద్దు చేసుకోవటం కాదు.. అన్ని అనుమతులు ఉన్నా కూడా విజయ్ ఎన్నికల కార్యక్రమాలు రద్దు చేస్తూ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు టీవీకే పార్టీ తరుఫున బరిలో ఉన్న అభ్యర్థులలో మెజారిటీ శాతం రాజకీయంగా కొత్త ముఖాలే. దీంతో అందరి తరుఫున విజయ్ ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ప్రజలకు వారిని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్నికల ప్రచారం ముగియడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉన్న ఇలాంటి పరిస్థితులలోనూ విజయ్ ఎన్నికల కార్యక్రమాలు రద్దు చేస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. మార్చి 30వ తేదీన చేశారు విజయ్. అనంతరం పెరంబూరులో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత కొలాతూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం విల్లివక్కమ్‌లో నిర్వహించాల్సిన కార్యక్రమం రద్దు అయ్యింది. అయితే ఇందుకు సెక్యూరిటీ సమస్యలు కారణంగా టీవీకే వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ రెండో తేదీన తిరుచిరాపల్లి ఈస్ట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయ్, అనంతరం ఏప్రిల్ 4న పుదుచ్చేరి వెళ్లారు. టి. నగర్, విళ్లివక్కమ్‌లలో ఏప్రిల్ ఆరో తేదీన నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారం రద్దు చేశారు. దీనికి సమయం లేకపోవటమే కారణమని టీవీకే వర్గాలు తెలిపాయి. నాలుగు రోజుల విరామం తర్వాత ఏప్రిల్ 8వ తేదీన తిరునల్వేలి, తూత్తుకుడిలో విజయ్ రోడ్ షో నిర్వహించారు. ఏప్రిల్ 9న కడలూరులో జరగాల్సిన కార్యక్రమం రద్దు చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న కడలూరు, ఏప్రిల్ 13న తిరువళ్లూరులో జరగాల్సిన ఎన్నికల సమావేశాలు కూడా రద్దు అయ్యాయి. ఏప్రిల్ 13న కన్యాకుమారి. ఏప్రిల్ 14న పుదుక్కొట్టైలలో విజయ్ ప్రచారం సాగనుంది. అయితే విజయ్ ఎన్నికల ప్రచార సభలు రద్దు కావడానికి గల కారణాలను టీఎంకే వర్గాలు అధికారికంగా వెల్లడించడం లేదు. అయితే తర్వాత ప్రచార సభల విషయంలో విజయ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని టీఎంకే వర్గాలు చెప్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోయారు. దీనికి టీవీకే నిర్వహణా లోపమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఎన్నికల ప్రచార సభల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే నేతలు మాత్రం విజయ్ ఎన్నికల ప్రచార సభలు రద్దు చేసుకోవడంపై విమర్శలు చేస్తున్నారు. విజయ్ రాజకీయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.