సంగారెడ్డిలో అంగన్వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు.. భర్తపై కోపంతో భార్యకు చిత్రహింసలు

Wait 5 sec.

రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది అని చెప్పే సంఘటన తాజాగా సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఏ తప్పూ చేయని ఓ మహిళపై గ్రామస్థులంతా విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమె భర్త చేసిన తప్పుకు.. మహిళను తీవ్రంగా హింసించారు. ఆ మహిళ భర్త ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదని.. ఆమెను చిత్ర హింసలకు గురి చేశారు. చివరికి తీవ్రంగా గాయపడిన ఆ మహిళ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో ఈ అమానుష సంఘటన జరిగింది. దామరగిద్ద గ్రామానికి చెందిన వసంతకుమారి రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్‌‌గా పనిచేస్తోంది. అయితే వసంత కుమారి భర్త ప్రభాకర్.. హెచ్‌బీఎం ఫైనాన్స్ పేరుతో గ్రామస్తుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. రాసోల్ గ్రామానికి చెందిన చాకలి బాలమణి, అవుటి సాయవ్వ, అవుటి బండ్యప్ప, భూతాలే వైద్యనాథ్, కోటగిరి రాములు అనే వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని మోసగించాడు. దీంతో తమ గ్రామంలో అంగన్వాడీ విధులకు వచ్చిన వసంతకుమారిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. అంతేకాకుండా జుట్టు కత్తిరించి గాడిదపై ఊరంతా ఉరేగిస్తామని తీవ్ర బెదిరింపులకు దిగారు. తాను ఏ తప్పు చేయలేదని.. తనను కొట్టొద్దని వసంత కుమారి ఎంత వేడుకున్నా కనీసం కనికరించని గ్రామస్తులు ఆమెపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. చెట్టుకు కట్టేసి ఆమెను గంటకు పైగా తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. వసంత కుమారి భర్త గ్రామంలోని పలువురు వద్ద నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని వారు ఆరోపించారు. ఇక ఆమె భర్తపై ఉన్న కోపంతో దీనితో ఎలాంటి సంబంధం లేని వసంత కుమారిపై గ్రామస్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. చివరికి గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని మాట్లాడటంతో వసంత కుమారిని విడిపించారు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ఘటన కాస్తా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. చేయని తప్పుకు ఆ మహిళను చిత్రహింసలకు గురి చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె భర్త తప్పు చేస్తే.. అతడికి శిక్ష విధించాలి గానీ మహిళను ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళ అని చూడకుండా అంత మంది దాడి చేయడం దుర్మార్గమని మండిపడుతున్నారు.