ప్రభుత్వ కార్యక్రమానికి ఆటోలో వచ్చిన పవన్ కళ్యాణ్.. ఆటో డ్రైవర్‌కు ఎంత ఇచ్చారంటే?

Wait 5 sec.

ఆటో డ్రైవర్ల కోసం ఆటో డ్రైవర్ల సేవలో అంటూ పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు పథకం అమలుతో ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. కింద అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు 15000 వేలు అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.90 లక్షల మంది ఆటోడ్రైవర్లకు ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున రూ.436 కోట్లు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేశారు. ఈ పథకం ప్రారంభం కోసం విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం , మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. అయితే వీరంతా ఈ కార్యక్రమానికి ఆటోల్లో వెళ్లారు. ఆటోలో ప్రయాణం చేసి వేదిక వద్దకు చేరుకున్నారు.ఇందులో భాగంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లి లోటస్ పాయింట్ నుంచి కార్యక్రమం జరుగుతున్న సింగ్ నగర్ వరకు ఆటోలో ప్రయాణించారు. జి. రాజేష్ అనే ఆటో డ్రైవర్ ఆటోలో.. పవన్ కళ్యాణ్ ప్రయాణించారు. డ్రైవర్ కుటుంబ సభ్యులతో కలసి వేదిక వరకూ ఆటోలో వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ ప్రయాణంలో ఆటో డ్రైవర్ జీవనం గురించి, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువ శాతం ఎవరు ఉంటారని ఆరా తీశారు. సి.ఎన్.జి. ఇంధనం సాయంతో నడిచే తన ఆటోలో ఉదయం, సాయంత్రం స్కూలు పిల్లలను తీసుకువెళతానని.. మిగిలిన సమయంలో సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్టు ఈ సందర్భంగా రాజేష్ పవన్ కళ్యాణ్‌కు వివరించారు. ఈ క్రమంలోనే ఈ - ఆటోల వినియోగం గురించి పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానిక ప్రదేశాల పేర్లను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై కనిపించిన అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. సింగ్ నగర్ వేదిక వద్దకు రాగానే పవన్ కళ్యాణ్ ఆటో దిగి వెళుతూ ఆటో డ్రైవర్‌కు ఐదు వందల రూపాయలు అందించారు.దీంతో ఆటో డ్రైవర్ కుటుంబం పొంగిపోయింది. అభిమాన హీరో, నాయకుడు తమ ఆటోలో ప్రయాణించారనే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. పవన్ కళ్యాణ్ ఆటో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్ లక్కీ అంటూ ప్రశంసిస్తూ నెటిజనం కామెంట్లు పెడుతున్నారు.