తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త ఎమ్మెల్సీలు అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌ చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటుపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ కుటుంబం అంతా ఒక్కటేనని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబం తెచ్చిపెట్టుకున్న నటనను ప్రదర్శిస్తున్నారని హేళన చేశారు. అదే సమయంలో కవిత కొత్త పార్టీపైనా సీఎం సెటైర్లు వేశారు. కేసీఆర్‌ స్థాపించిన పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇప్పటివరకు గతం ఉందని.. ఇక నుంచి భవిష్యత్‌ లేదని విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమం సమయంలో ఎలా మాట్లాడినా ప్రజలు సహించారని.. కానీ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లు కూడా అలాగే మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఒక చనిపోయిన శవం లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి శవానికి ఎంత అలంకరణ చేసినా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని.. ఆ పార్టీ మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు గత పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో పాలన కొనసాగించారని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, నాయకులను భరించలేక అధికారం నుంచి దించేశారని తెలిపారు. కొత్త పార్టీతో రాష్ట్రంలో అసలు పనే లేదని.. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీనే ఉంటుందా.. ఊడుతుందా అనే పరిస్థితికి చేరుకుందని రేవంత్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. ఈ సందర్భంగా కవిత పార్టీపైనా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని పేర్కొన్నారుకేసీఆర్‌ కుటుంబానికి, బీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలతో సంబంధాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌ రెస్ట్‌లో ఉన్న ప్రజాప్రతినిధి అని.. ఆయన చావును తానెందుకు కోరుకుంటానని రేవంత్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తమకు మంచిదని పేర్కొన్నారు. కేసీఆర్ మర మనిషో కాదో.. ఆయన కుటుంబ సభ్యులకే తెలుసని అన్నారు. వివక్ష లేని పాలన తమది అని.. తమకు ప్రతిపక్షమే లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్‌ రిపోర్టును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టలేదని ఈ సందర్భంగా సీఎం తేల్చి చెప్పారు. కమిషన్ రిపోర్టులో సాంకేతిక లోపాలు ఉన్నాయని మాత్రమే కోర్టు చెప్పిందని పేర్కొన్నారు. రిపోర్టు ఆధారంగా చర్యలు వద్దని హైకోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. సీబీఐ విచారణ తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.