ఫ్యూచర్‌సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం.. అక్కడ అతిపెద్ద బస్ టెర్మినల్, సీఎం కీలక ప్రకటన

Wait 5 sec.

ప్రపంచంలోనే అద్భుత నగరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలంటే స్థానిక సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని, అప్పుడే అద్భుతమైన సిటీగా రాణించగలదని చెప్పారు. రంగారెడ్డి మీర్ఖాన్‌పేట‌లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ మంగళవారం (ఏప్రిల్ 28) భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అద్భుతనగరంగా నిర్మిస్తామని అన్నారు. మరికొన్ని గ్రామాలను సైతం ఫ్యూచర్ సిటీలో కలిపే ప్రతిపాదన ఉందని చెప్పారు. 'తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో కలపలేదని, వాటినీ కలపాలని కొంతమంది పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రతినిధులు కొందరు నా దృష్టికి తెచ్చారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి తదనుగుణంగా తీర్మానాలు చేసి కలెక్టర్‌కుపంపించాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రాంతాన్ని అధునాత నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. ఈ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశమని, ఎక్కడైతే అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపించాలని అనుకున్నామో అక్కడే నిర్వహించాలన్న ఉద్దేశంలో ఇక్కడ 3 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం. ఇక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడో ఒప్పందాలు చేసుకోవడమేంటని ముందుగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ కార్యాలయం నిర్మిస్తున్నాం. జూన్ 2 లోపే నిర్మాణం పూర్తి చేసుకుని ఆ భవనం నుంచి కార్యక్రమాలు చేపడుతాం. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి వాటిని ప్రతిపాదించినప్పుడు సాధ్యమవుతాయా? అని కొందరు ఆనాడు అవహేళన చేసిండ్రు. కానీ నిజమయ్యాయి. దేశంలో ఏ నగరానికి లేని విధంగా 160 కి.మీ. మేరకు అవుటర్ రింగ్ రోడ్డు సాధ్యమైంది. ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయే వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది. ఎవరికో నష్టం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీ పిల్లలు చదువుకున్న వారైతే స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేదల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలి. అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. వారిని గౌరవించాలి. వారి బాధలు వినాలి. ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టని వారు భవిష్యత్తులో ఏదో కోల్పోయామన్న బాధ పడాల్సి వస్తుంది. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్స్‌కు హబ్‌గా మారనుంది. బుల్లెట్ ట్రైన్స్‌కు తోడు ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అనుసంధానం చేయబోతున్నాం. బుల్లెట్ ట్రైన్ హబ్‌తో పాటు మెట్రో, అతిపెద్ద బస్ టర్మినల్ కూడా నిర్మించబోతున్నాం. ఇవన్నీ పూర్తిచేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. అభివృద్ధి పనులు వేగంగా చేయాలన్న ఆలోచనలో చిన్నచిన్న తప్పిదాలు దొర్లితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని ముందుకు నడవాలి.' అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.