‘‘నాది తిరుగుబాటు.. బాబుది వెన్నుపోటు’’ అంటూనే.. చంద్రబాబును సమర్థించిన నాదెండ్ల భాస్కరరావు!

Wait 5 sec.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు బుధవారం కన్నుమూశారు. . నాదెండ్ల భాస్కర రావు ప్రస్తుత తరానికి జనసేన నేత, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రిగానే తెలుసు. అయితే 1980, 1990 దశకాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని దోనేపూడి గ్రామంలో నాదెండ్ల పిచ్చియ్య, వెంకాయమ్మ దంపతులకు భాస్కర రావు 1935 జూన్ 23న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్‌గా కెరీర్ ప్రారంభించారు. 1978లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల.. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గంలో పని చేశారు. కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని భావించిన భాస్కరరావు.. ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుసుకొని ఆయనతో చేతులు కలిపారు. తెలుగుదేశం పార్టీ విధివిధానాలు, ప్రణాళికను రూపొందించడంలో నాదెండ్ల భాస్కర రావు కీలక పాత్ర పోషించారు. 1982 మార్చి 29న హైదరాబాద్‌లో ఎన్టీఆర్ పార్టీ ప్రకటన చేశారు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్నారు. 1983లో టీడీపీ విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ ఆయనకు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు.టీడీపీ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కరరావు.. తర్వాతి రోజుల్లో పార్టీలో సంక్షోభానికి కూడా కారణం అయ్యారు. 1984లో ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్లగా.. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ మద్దతుతో సీఎం అయ్యారు. అయితే ఎన్టీఆర్ తిరిగొచ్చి, బలాన్ని నిరూపించుకోవడంతో నాదెండ్ల నెల రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.1995లో టీడీపీ పగ్గాలతోపాటు సీఎం పదవిని ఎన్టీఆర్ దగ్గరి నుంచి చంద్రబాబు నాయుడు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన విషయమై నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయం తెలుసుకోవడం కోసం.. మురళీ బుద్ధా అనే రిపోర్టర్‌ ఆయనకు ఫోన్ చేశారు. మీరు నాకే ఎందుకు ఫోన్ చేశారని ఆయన ప్రశ్నించగా.. ‘1984లో మీరు చేసిందే.. చంద్రబాబు 1995లో చేశారు. మీరు ఫెయిల్ అయ్యారు, బాబు సక్సెస్ అయ్యారు. తప్పు ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారు’ అని ఆ జర్నలిస్టు అడిగారు. దీనికి నాదెండ్ల భాస్కరరావు నవ్వుతూ బదులిచ్చారట. నేను చేసింది వెన్నుపోటు కాదు.. నేరుగా తిరుగుబాటు చేశాను. చంద్రబాబుదే వెన్నుపోటు. సొంత అల్లుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాడు. నేను బయటి వ్యక్తిని, నాది వెన్నపోటు ఎలా అవుతుందని ఆయన తిరిగి ప్రశ్నించారట. అయితే ఎన్టీఆర్‌ను చంద్రబాబు పదవి నుంచి దించేయడాన్ని సమర్థిస్తున్నానని నాదెండ్ల చెప్పినట్లు ఆ జర్నలిస్టు తెలిపారు. అంతే కాదు 1984లో ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసిన తనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని.. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ పార్టీ మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారట. తర్వాత మీడియా సమావేశం పెట్టి వివరంగా మాట్లాడతానని నాదెండ్ల భాస్కరరావు తనతో చెప్పారని.. జర్నలిస్టు బుద్ధా మురళి ఫేస్‌బుక్‌ ద్వారా నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.