ఆంధ్రప్రదేశ్‌లో మాడు పగిలే ఎండలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే 35 డిగ్రీలకుపైగా ఎండలు మొదలు కాగా.. మార్చిలో 40 వరకు నమోదయ్యాయి.. ఏప్రిల్ నెలలో ఏకంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాదు ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోత వాతావరణం ఉంటోంది.. అలాగే పిడుగులతో కూడిన అకాల వర్షాలు పడుతున్నాయి. విచిత్రంగా సాయంత్రం వరకు ఎండలు.. ఆ తర్వాత వానలు కురుస్తున్నాయి.ఇవాళ రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది. అలాగే మరో 89 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ విజయనగరం జిల్లాలో 22 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాలు, పోలవరం జిల్లాలో 4 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 4 మండలాలు, కాకినాడ జిల్లాలో 2 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2 మండలాలు, ఏలూరు జిల్లాలో ఒక మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలంలో తీవ్ర వేడిగాలులు వీస్తాయి. అంతేకాదు శనివారం 7 మండలాల్లో తీవ్ర వేడిగాలులు.. 31 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గురువారం ఏకంగా 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాదు 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 45.4 డిగ్రీలు, కడపలో 45.1 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.1 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలు, ఉక్కపోత, వేడి గాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. జనాలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణిలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. తాగునీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలిన సూచిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వేడిగాలులు, ఉక్కపోత ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది.