ఎవరైనా ప్రకాష్ రాజ్‌ను చంపేస్తే నేనే తొలి నిందితుడిగా ఉంటా.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Wait 5 sec.

నటుడు ప్రకాష్ రాజ్‌పై రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి.. వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలేపారు. రామాయణ ఘట్టాలు, శ్రీరాముడు, లక్ష్మణుడిని ఉద్దేశించి చేసిన సెటైరికల్ వ్యాఖ్యలపై శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. పలువురు కేసులు కూడా నమోదు చేశారు. అయితే చేసినప్పటికీ.. ఈ వివాదం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి.ప్రకాష్ రాజ్‌ను ఎవరైనా చంపితే ఆ హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉండేందుకు తాను సిద్ధం అంటూ వనిపల్లి శ్రీనివాస్ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనకు పూర్తి బాధ్యత తనదే అంటూ ఆయన చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన రాముడు, లక్ష్మణుడు అడవిలో పండ్లు తింటుంటే దానికి జీఎస్టీ కట్టాలని.. అదే సమయంలో వన్ నేషన్ వన్ రిలీజియన్ అంటూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా మాట్లాడారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించే క్రమంలో ప్రకాష్ రాజ్.. పవిత్ర రామాయణాన్ని, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడిని అవమానపరచడం సహించరాని నేరమని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రకాష్ రాజ్ నాస్తికుడిని అని చెప్పుకుంటూ.. కేవలం హిందూ మతాన్ని, ధర్మాన్ని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు.అదే సమయంలో ప్రకాష్ రాజ్ పర్సనల్ లైఫ్, గతంలో చేసిన వ్యాఖ్యలపైనా శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రకాష్ రాజ్ ఒక అర్బన్ నక్సలైట్ అని.. తుకుడే గ్యాంగ్ సభ్యుడిగా అభివర్ణించారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో దేశానికి వ్యతిరేక నినాదాలు చేసే వారికి.. బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహించే వారికి ప్రకాష్ రాజ్ మద్దతు తెలిపాడని ఆరోపించారు. తాను దక్షిణ భారతీయుడిని అని చెప్పుకుంటూనే రాముడిపై జోకులు వేయడం ప్రకాష్ రాజ్ పైశాచిక ఆనందానికి నిదర్శనమని మండిపడ్డారు. హిందువులు, సనాతన ధర్మంపై ఎక్కడ జోకులు వేసినా వెంటాడి, వేటాడతామని తీవ్ర హెచ్చరికలు చేశారు.ప్రకాష్ రాజ్ షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి వచ్చి తాము అడ్డుకుంటామని.. ఆయన టూర్ డైరీని ఫాలో అవుతామని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్‌ను పూర్తిగా బ్యాన్ చేయాలని అగ్ర హీరోలు, నిర్మాతలను డిమాండ్ చేశారు. ఇది నయా భారత్ అని.. ఇక్కడ హిందూ ధర్మాన్ని కించపరిస్తే సహించబోమని హెచ్చరించారు. పాకిస్తాన్‌లో అజ్ఞాత వ్యక్తులు చేస్తున్న ఆపరేషన్లను దృష్టిలో పెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరికలు చేశారు.