తిరుమల శ్రీవారి ఆలయం ఇవాళ మూతపడుతోంది. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమవుతుంది.. సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. అయితే చంద్రగ్రహణానికి ఆరుగంటల ముందుగా ఆలయ తలుపు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు దర్శనాలు తిరిగి ప్రారంభం అవుతాయి.. భక్తుల్ని అనుమతిస్తారు. ఇవాళ చంద్రగ్రహణం కావడంతో తిరుపతి, తిరుచానూరులోని (టిటిడి) ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తారు. మరికొన్ని చోట్ల కూడా అన్నప్రసాదం అందుబాటులో ఉండదు. కొన్నిచోట్ల మాత్రం ముందుగానే అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టీటీడీ స్థానికాలయాలు కూడా మూతపడతాయి. ఇవాళ మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం కొనసాగనుంది. ఈ ఆలయాల్లో కూడా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా ఉంది. 'తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలు మూసివేస్తారు. నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సత్రవాడలోని శ్రీ కరివరదరాజస్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామి ఆలయం, తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహ‌స్వామివారి ఆలయం, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలను ఉదయం 9 గంటలకు ఆలయాలు మూసివేస్తారు. రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతిస్తారు' అని టీటీడీ తెలిపింది.తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్పపై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు. మంగళ వాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రప‌ర్వంగా జరిగింది. ఈ తెప్పోత్సవంలో తిరుమల‌ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.