: కొంత కాలంగా భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. . అయినప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ నేపథ్యంలో కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల దగ్గర బంగారం హోల్డింగ్స్ పెరుగుతుండటం వల్ల దాని విలువ కూడా పెరుగుతుంటుంది. పండగలు, శుభకార్యాలు, వివాహాలు ఇతర వేడుకల సమయాల్లో మహిళలు, పురుషులు బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ధరిస్తుంటారు. బంగారం కేవలం అలంకరణగానే కాకుండా.. సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంది. అయితే మరి ప్రజలు తమ దగ్గర లేదా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు అనే దానికి పరిమితి ఏమైనా ఉందా? ఎవరు ఎంతైనా కొనుగోలు చేయొచ్చా అనేది తెలుసుకుందాం. ఆభరణాల రూపంలో ఇంట్లో ఇంత వరకే బంగారం ఉంచుకోవచ్చనే దానిపై చట్టపరంగా ఎలాంటి నిబంధనా లేదు. 1994 నాటి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ప్రకారం.. ఇన్‌కంటాక్స్ రైడ్స్ సమయంలో ఒక లిమిట్ వరకు బంగారు ఆభరణాల్ని సీజ్ చేయొద్దని అధికారులకు సూచించింది. అంటే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఎవరు ఎంతైనా బంగారం కలిగి ఉండొచ్చు. టాక్స్ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఒక పరిమితి వరకు బంగారంపై ఎలాంటి నిబంధనా లేదు. ఆ పరిమితి దాటితే సరైన ప్రూఫ్స్ లేకుండా ఐటీ శాఖ మీ దగ్గర ఉన్న బంగారాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. >> ఇక్కడ పెళ్లయిన, పెళ్లి కాని మహిళలకు.. పురుషులకు ఈ పరిమితి వేరేలా ఉంది. టాక్స్ ఇబ్బందులు లేకుండా.. పెళ్లైన మహిళలు గరిష్ఠంగా 500 గ్రాముల వరకు (50 తులాలు) బంగారాన్ని ఉంచుకోవచ్చు. పెళ్లి కాని యువతి/మహిళ దగ్గర 250 గ్రాముల వరకు పసిడి ఉండొచ్చు. ఇక పురుషుల దగ్గర చూస్తే ఈ గోల్డ్ జువెల్లరీ లిమిట్ 100 గ్రాములుగా ఉంది. ఈ పరిమితి వరకు ఐటీ శాఖకు.. ఏ పరిస్థితుల్లో అయినా బంగారాన్ని సీజ్ చేసే అధికారం లేదు. వారసత్వంగా వచ్చిన బంగారంపైనా పరిమితులు ఉండవు. ఇక్కడ ఆధారాలు మాత్రం చూయించాల్సి ఉంటుంది. ఈ పరిమితి దాటినప్పుడు కచ్చితంగా బంగారానికి తగిన ప్రూఫ్స్/రశీదులు చూయించాల్సి ఉంటుంది. ఇంకా కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పరిమితులు వర్తిస్తాయి. కుటుంబ సభ్యులు కాని వ్యక్తుల బంగారం మీ ఇంట్లో ఉంటే ఐటీ శాఖ రైడ్స్ సమయంలో దానిని స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది. ఈ నిబంధన కేవలం ఆభరణాలకే వర్తిస్తుంది. పెట్టుబడుల కోసం కొనుగోలు చేసిన గోల్డ్ కాయిన్స్, బార్స్, బిస్కెట్స్ వంటివి పరిమితికి మించి ఉన్నప్పుడు కచ్చితంగా ఆధారాలు చూయించాలి. వాటికి నిబంధనలు వేరేలా ఉంటాయి.