తెలంగాణలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజ్యసభ అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌లను ఢిల్లీకి పిలిచే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు స్థానాల్లో ఒక స్థానం మళ్లీ అభిషేక్‌ సింఘ్వీకే ఖాయం అనే చర్చ జరుగుతోంది. మిగిలిన ఒక ఎంపీ పదవి కోసం పోటీ పెరిగిందంటున్నారు. చాలామంది ఉన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వినయ్‌కుమార్, జెట్టి కుసుమకుమార్‌‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వంశీచంద్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.. వీరిలో ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లారు.. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. వీహెచ్, జెట్టి కుసుమకుమార్‌లో ఎవరో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని జగ్గారెడ్డి ఖర్గేను కోరారు. వంశీచంద్‌రెడ్డి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోందట. వీరిలో పాటుగా బీసీ, మైనార్టీ కోటాలో మరికొందరు కూడా ఎంపీ పదవి కోరుతున్నారట. బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయని బలమైన నేతలకు ఛాన్స్ ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. మరి అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. అన్ని కుదిరితే ఇవా సాయంత్రం కానీ, బుధవారం కానీ ఓ క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యసభ అవకాశం ఎవరికి ఇస్తుందో చూడాలి.కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 18న సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి రెండుస్థానాలు ఖాళీ అవుతున్నాయి.. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 9తో ముగుస్తాయి. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేషన్లు దాఖలు చేసేందుకు మార్చి 5 వరకు అవకాశం ఉంది. మార్చి 6న నామినేషన్లు పరిశీలిస్తారు.. మార్చి 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు (మార్చి 16) సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.