ఏపీలో సింగపూర్ మోడల్.. మంత్రుల బృందం అధ్యయనం..

Wait 5 sec.

నారాయణ, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, వంగలపూడి అనితలతో కూడిన బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ఆధునిక పరిపాలనా విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ జవాబుదారీతనం వంటి అంశాలను ఏపీ మంత్రుల బృందం అధ్యయనం చేయనుంది. ఏప్రిల్ 27వ తేదీ వరకూ మొత్తం వారం రోజుల పాటు ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన జరగనుంది. సింగపూర్- ఏపీ ప్రభుత్వం జాయింట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్ (SGJIWC) ఆధ్వర్యంలో నిర్వహించే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమానికి మంత్రులు హాజరవుతారు. ప్రజాసేవను మరింత సమర్థంగా అందించడానికి అవసరమైన నూతన నాయకత్వ సూత్రాలను శిక్షణలో భాగంగా తెలుసుకుంటారు. మరోవైపు పర్యటనలో భాగంగా తొలిరోజైన మంగళవారం సింగపూర్ తెలుగు అసోసియేషన్ సభ్యులు ఏపీ మంత్రుల బృందానికి సాదర స్వాగతం పలికారు. అనంతరం సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్‌తో ఏపీ మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి, స్మార్ట్ సిటీస్, ఆర్బన్ ప్లానింగ్, ఫిన్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో సింగపూర్ నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవడంపై విస్తృతంగా చర్చించారు. ఈ విషయాన్ని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అత్యంత సానుకూల వాతావరణంలో జరిగిన ఈ సమావేశం జరిగిందని.. భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రగతికి, ఇరు దేశాల మైత్రిని మరింత ఉన్నత స్థాయికి చేర్చడానికి ఈ సమావేశం తోడ్పడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సింగపూర్‌లోని ప్రముఖ అవర్ టాంపైన్స్ హబ్‌ను ఏపీ మంత్రులు సందర్శించారు. సింగపూర్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు, క్రీడా సౌకర్యాలు, పారదర్శకమైన పాలనా విధానాలను పరిశీలించారు. ప్రజలతో ప్రజాప్రతినిధులు నేరుగా మమేకమై.. ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారో తెలుసుకున్నారు. ఇలాంటి విధానాన్నే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసి, ప్రభుత్వ సేవలను మరింత ప్రజానుకూలంగా మారుస్తామని మంత్రి అనిత తెలిపారు. సింగపూర్ తొలిరోజు పర్యటనలో విలువైన అనుభవాలను పొందామని.. ప్రజల భాగస్వామ్యం, సామాజిక సమగ్రత అనే అంశంపై సింగపూర్ మోడల్‌ను లోతుగా అధ్యయనం చేసినట్లు వెల్లడించారు.