ఏడాదిన్నర వయసు ఉన్న ఓ చిన్నారి ప్రాణం నిలిపేందుకు తెలుగు ప్రజలు చేసిన ప్రయత్నం ఫలించింది. కర్నూలు చిన్నారి పునర్విక మృత్యువును జయించింది. పునర్వికకు పునర్జన్మ లభించింది. చిన్నారి మోముపై మళ్లీ చిరునవ్వులు విరబూశాయి. కావాల్సిన రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఆమెకు అందింది. అత్యంత అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో (SMA Type-1) బాధపడుతున్న పునర్వికను కాపాడేందుకు మంత్రి విదేశాల నుంచి ఈ ఇంజెక్షన్ తెప్పించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఉన్న రెయిన్‌బో ఆసుపత్రిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెయిన్‌బో ఆస్పత్రి డాక్టర్లు విదేశాల నుంచి తెప్పించిన రూ. 16 కోట్ల ఖరీదైన జోల్ జెన్ స్మా ఇంజెక్షన్ పునర్వికకు అందించారు. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతిల కుమార్తె పునర్విక. పుట్టిన ఆరు నెలలకే పునర్విక శరీరంలో కదలికలు తగ్గిపోయాయి. తల్లిదండ్రులు డాక్టర్లను సంప్రదిస్తే.. పునర్వికను పరీక్షించిన వైద్యులు.. ఆమె అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా పునర్విక వెన్నెముక కండరాలు క్షీణించి, శ్వాస తీసుకోవడం కష్టమయ్యే పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. అయితే సెలూన్ షాపులో పనిచేసే సురేష్ కుమార్‌కు.. అంత మొత్తాన్ని ఎలా సేకరించాలో అర్థం కాలేదు. ఓ వైపు చిన్నారి ప్రాణం.. మరోవైపు అంతంత మాత్రంగా ఆర్థిక పరిస్థితి. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజల చిన్నారి పునర్వికకు అండగా నిలిచారు. సేవ్ పునర్విక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. పునర్విక కథ ప్రతి ఒక్కరినీ కదిలించింది. పసిపాప ప్రాణాన్ని నిలబెట్టేందుకు తెలుగు ప్రజలు తమ ఉదారతను చూపించారు. లక్షలాది మంది దాతలు స్పందించారు. తమకు తోచిన సాయం ఇంకో రూ. 6 కోట్లు అవసరం కాగా.. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న నారా లోకేష్.. ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించేందుకు తన వ్యక్తిగత సిబ్బందిని రంగంలోకి దించారు నారా లోకేష్. అన్ని అనుమతులు వేగంగా మంజూరయ్యేలా చూశారు. దీంతో చిన్నారి పునర్వికకు పునర్జన్మ లభించింది. శనివారం ఆమెకు కావాల్సిన ఇంజెక్షన్ వైద్యులు అందించారు. ఈ సందర్భంగా వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్. పునర్వికను ఎత్తుకుని లాలించారు. వందేళ్లు చల్లగా ఉండు తల్లీ అంటూ దీవించారు. తమ కుమార్తె ప్రాణాలను కాపాడిన నారా లోకేష్‌కు, తెలుగు ప్రజలకు పునర్విక తల్లిదండ్రులు కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలియజేశారు.