హనుమాన్ ఆలయం అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన ఆలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ఇక ప్రస్తుతం హనుమాన్ మాలల సీజన్ కావడంతో నిత్యం వేలాది మంది భక్తులు కొండగట్టుకు చేరుకుని అంజన్న దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. కొండగట్టు ఆంజనేయ స్వామి కృప కోసం.. హనుమాన్ మాలలు వేసుకున్న వారు మాత్రమే కాకుండా.. సాధారణ భక్తులు కూడా కొండకు పోటెత్తుతూ ఉంటారు. అయితే అలాంటి పవిత్రమైన కొండగట్టు ఆలయం నిర్వహణపై భక్తులు తీవ్ర అసంతృప్తి ఉంటుంది. ఆలయంలో వసతుల కల్పనపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టు ఆలయంలో భక్తుల కోసం కనీసం వసతులు కూడా ఏర్పాటు చేయడం లేదని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఆలయ హుండీలో ఎందుకు డబ్బులు వేయాలి అంటూ హనుమాన్ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 2వ తేదీ జరిగిన హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు జరిగాయి. 16 రోజుల ఉత్సవాలకు సంబంధించి.. ఆలయ ఆవరణలో 14 హుండీలను ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఆలయ ఈవో అంజనా రెడ్డి ఆధ్వర్యంలో హుండీల లెక్కింపు చేపట్టగా.. అందులో పదుల సంఖ్యలో లేఖలు బయటపడటం తీవ్ర చర్చకు దారితీసింది. కొండగట్టులో సౌకర్యాలు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయం అంటూ ఆ లేఖల్లో పేర్కొన్నారు. భక్తులకు కొండగట్టులో తీవ్రమైన అసౌకర్యాలు ఉన్నాయని.. కోనేరులో నీరు కూడా శుభ్రంగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టాయిలెట్స్ తీవ్ర కంపుతో కనీసం ఉపయోగించలేకుండా ఉన్నాయని పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో కనీసం మంచి నీళ్ల ఏర్పాట్లు కూడా చేయడం లేదని ఆరోపించారు. ఆలయ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండటం లేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే హనుమాన్ ఉత్సవాల సందర్భంగా వచ్చిన భక్తులు వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలను లేఖపై రాసి హుండీలో వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కొండగట్టులో సౌకర్యాలు కల్పించే వరకు హుండీలో డబ్బులు వేయొద్దని భక్తులు ఇతర భక్తులకు కూడా పిలుపునిచ్చారు. కొండగట్టుకు సమర్పించే విరాళాలు, కానుకలతో.. తమ గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని ఇటీవలె కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో కొండగట్టు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అయినప్పటికీ కొండగట్టు ఆలయ అధికారులు కనీసం స్పందించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.