కుకు విత్ జాతిరత్నాలు రెండో సీజన్ ఐదో ఎపిసోడ్ గ్రాండ్‌గా సాగింది. ఈ ఎపిసోడ్‌లో నిఖిల్ మళ్లీ అదరగొట్టేశాడు. తన వంటలు, ప్రజెంటేషన్‌తో జడ్జ్‌ల మనసు గెల్చుకున్నాడు. ఇక గత వారం మాదిరిగానే మళ్లీ వెనుక పడ్డాడు. చూస్తుంటే ఈ వారం ఎలిమినేషన్‌‌కి దగ్గర్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇకపోతే ఈ వారం ఏ ఏ జాతిరత్నం ఏ ఏ కుక్‌తో ఉన్నాడు.. జాతి రత్నాలు చేసిన అల్లరి ఏంటి? కుక్స్ వండిన స్పెషల్ వంటకాలు ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.పెయిరింగ్ టాస్కుతో పల్లవికి చంటి గెటప్‌లో ఉన్న మణికంఠ, నిఖిల్‌కి అతిలోక సుందరి గెటప్‌లో ఉన్న రోహిణి, తనూజకి ఎన్టీ రామారావు గెటప్‌‌లో ఉన్న అవినాష్, కళ్యాణ్‌కి రాధ గెటప్‌లో ఉన్న దీపిక, ఆషికకి స్వాతిముత్యం లుక్‌లో ఉన్న హేమంత్ వచ్చారు. ఇక పెయిరింగ్ టాస్క్ తరువాత అడ్వాంటేజ్ టాస్క్ జరిగింది. ఇందులో చివరకు దీపిక ఇచ్చిన క్లూలతో కళ్యాణ్ అన్నింటినీ గెస్ చేసి మూడు పాయింట్లు సంపాదించాడు. ఈ టాస్కులో మాత్రం మణికంఠని చూస్తే.. ఇతనేంటి.. ఇంత వరెస్ట్‌గా ఉన్నాడు అని జనాలు అనుకునే ప్రమాదం ఉంది. కనీసం మునగాకుని గుర్తు పట్టలేదు.. వాముకి, జీలకర్రకి తేడా తెలీదు.. నువ్వులు అంటే కూడా తెలీదు.. ఇలా రాంగ్ హింట్స్‌తో పల్లవిని హింసించేశాడు మణికంఠ. కుక్స్ వండే టైంలో ఓ ట్విస్ట్ ఇచ్చారు. కుక్స్ కళ్లకి గంతలు కట్టుకోవాలి.. జాతి రత్నాలు వంట చేయాలని మెలిక పెట్టారు. దీంతో కుక్స్ చాలా కష్టపడ్డారు. ఏ ఏ వస్తువులు తీసుకు రావాలి.. ఏమేం చేయాలో అని జాతి రత్నాలకు చెప్పలేక తెగ ఇబ్బందిపడ్డారు. ఇందులో మణికంఠ అయితే పల్లవి చెప్పేది వినకుండానే వెళ్లిపోతూ ఉన్నాడు. ఒకటి చెబితే ఇంకోటి తెచ్చి పెట్టాడు. అలా మొత్తం పెంట పెంట చేసేశాడు మణికంఠ. కొబ్బరి పాలు అడిగితే.. కొబ్బరికాయ, పాలు తీసుకు వచ్చి ఇచ్చాడు. అలా జాతి రత్నాలు అందరూ కూడా కుక్స్‌ని తెగ ఆడుకున్నారు. వంట చేసే టైంలో దీపిక, రోహిణి, అవినాష్ చేసిన అల్లరిని చూస్తే ఎవర్రా మీరంతా అని ఆడియెన్స్‌కి అనిపించే అవకాశం ఉంది.చివరకు కుక్స్ చేసిన వంటల్ని జడ్జ్‌లు టేస్ట్ చేసి మార్కులు ఇచ్చారు. నిఖిల్ చేసిన మటన్ కీమా, జీడిపప్పుని, అతగాడి ప్రజంటేషన్‌‌ను చూసి సంజయ్ అయితే హగ్ ఇచ్చాడు. ఇక తనూజ చేసిన చిట్టి పెసరట్టు, ఘీ రోస్ట్ పన్నీర్‌కి మిక్స్డ్ రివ్యూ వచ్చింది. పల్లవి చేసిన కోనసీమ కొబ్బరి పులావ్ బాగానే ఉన్నా.. ప్రాన్స్ కర్రీ, ఆరెంజ్ షాట్స్ తేడా కొట్టేసింది. కళ్యాణ్ ప్రిపేర్ చేసిన కార్న్ మూంగ్దాల్ కిచ్డీ.. నిజంగానే కిచ్డీ చేసేశావ్ అంటూ అలీ సెటైర్ వేశాడు. ఆషిక చేసిన ఆరెంజ్ చికెన్ మీద కూడా మిక్స్డ్ రివ్యూనే వచ్చింది.అలా శనివారం నాటి ఎపిసోడ్‌లో 83 మార్కులతో నిఖిల్ ప్రథమస్థానంలోకి వచ్చాడు. కళ్యాణ్ పడాల 64 మార్కులతో చివరి స్థానంలోకి వెళ్లిపోయాడు. గత శనివారం మార్కుల్ని కూడా కలిపితే.. నిఖిల్ 164 మార్కులతో ఫస్ట్ ప్లేస్, 134 మార్కులతో కళ్యాణ్ చివరి స్థానంలోకి వచ్చాడు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్‌‌లోని కుక్స్ మార్కులు, అందులో చివరి స్థానంలో ఉన్న కుక్‌తో కళ్యాణ్ పోటీ పడాల్సి ఉంటుంది. అలా ఇద్దరిలో మళ్లీ తక్కువ వచ్చిన కుక్ బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.