శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో 3 రోజుల పాటు ఉత్సవాలు.. పలు సేవలు రద్దు

Wait 5 sec.

ఏప్రిల్ 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుమల కొండపై శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు జరగనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికార వర్గాలు వెల్లడించాయి. తిరుమలలో ఈ పరిణయోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఉన్న పరిణయోత్సవ మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయం వేడుకలను అంగ రంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించింది. ఈ సందర్భంగా భక్తుల రద్దీ నేపథ్యంలో.. ఆ 3 రోజుల పాటు కొన్ని సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీవారి భక్తులు సహకరించి.. స్వామి వారి దర్శన ఏర్పాట్లను చేసుకోవాలని సూచించింది. ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ పద్మావతి, శ్రీనివాసుల పరిణయ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇక రెండోరోజు అశ్వవాహనం.. చివరిదైన మూడో రోజు గరుడ వాహనంపై శ్రీవారు, పద్మావతి అమ్మవార్లు విహరించనున్నట్లు వెల్లడించాయి.అదే సమయంలో ప్రత్యేక పల్లకీల్లో ఉభయ నాంచారులు పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాల నిర్వహణ సందర్భంగ ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారికి సంబంధించిన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార వంటి రెండు సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అందుకు అనుగుణంగా భక్తులు ఏర్పాట్లు చేసుకోవాలని హితవు పలికింది.పురాణాల ప్రకారం 5 వేల ఏళ్ల క్రితం.. అంటే కలియుగం ప్రారంభం అయిన మొదట్లో వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరునిగా భూమిపైకి వచ్చినట్లు చెబుతారు. అదే సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశ రాజు.. తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వేంకటేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశారని పేర్కొంటారు. వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు.. నారాయణ వనంలో పద్మావతి అమ్మవారిని కన్యా దానం చేసినట్లు శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం వెల్లడిస్తోంది.అప్పటి పద్మావతీ, శ్రీనివాసుల కళ్యాణోత్సవానికి గుర్తుగా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి.. దానికి ముందు, తర్వాత రోజులు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉంటుంది. 1992 నుంచి ఈ పరిణయోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.