ఐఐటీ హైదరాబాద్‌లో ఓ విద్యార్థి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఏడాది ఐఐటీహెచ్‌లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ఒక సంస్థ ఇంత భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. 2008లో ప్రారంభమైన చరిత్రలోనే ఇది అత్యధిక ప్యాకేజీ అని సంస్థ తెలిపింది.ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే ఫైనల్ ఇయర్ విద్యార్థి సాధించాడు. అతడు 2026, జూలై నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ అయిన ఆప్టివర్ (Optiver) లో చేరనున్నాడు. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ను ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ (పీపీఓ) గా మార్చుకుని ఈ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నాడు.ఈ సందర్భంగా వర్గీస్ మాట్లాడుతూ ‘క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నేను ఇంటర్వ్యూలో పాల్గొన్న తొలి, చివరి కంపెనీ ఆప్టివర్‌నే. నాకు ఈ కంపెనీలో ఉద్యోగం వస్తుందని నా మెంటర్ చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఈ విషయం తెలిసి మా అమ్మానాన్నలు కూడా చాలా ఆనందపడ్డారు’ అని చెప్పుకొచ్చాడు.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వర్గీస్ 6వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత 7 నుంచి 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్నాడు. ప్రస్తుతం ఐటీ మార్కెట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. తనకు తప్పకుండా మంచి ప్యాకేజీతో ఉద్యోగం వస్తుందని నమ్మకంగా ఉన్నానని వర్గీస్ తెలిపాడు.పైగా తాను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచే తాను కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌లో పాల్గొంటూ, దేశంలో టాప్ 100 లో ఉండేవాడినని చెప్పుకొచ్చాడు వర్గీస్. అది కూడా ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి తనకు సహాయపడిందని తెలిపాడు. అలాగే తమ కరికులం లోని వైవిధ్యమైన కోర్సులు కూడా తనకు ఎంతో ఉపయోగపడ్డాయన్నాడు. తనకు పీపీఓ రావడం అదృష్టమంటున్నారు వర్గీస్ తల్లిదండ్రులు. వారు కూడా ఇంజనీర్లే కావడం విశేషం.ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇద్దరు విద్యార్థులు ఆప్టివర్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారు, కానీ వర్గీస్‌కు మాత్రమే పీపీఓ వచ్చింది. ఈ వేసవి కాలంలో ఇంటర్న్‌షిప్‌లో రెండు వారాల శిక్షణ, ఆరు వారాల ప్రాజెక్ట్ ఉండనున్నాయి. అతను ఆ సంస్థ నెదర్లాండ్స్ ఆఫీసులో పూర్తికాలం పనిచేయనున్నాడు. వర్గీస్‌తో పాటు, మరో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థికి రూ. 1.1 కోట్ల ప్యాకేజీ వచ్చింది. ఇది కూడా సంస్థకు ఒక రికార్డు. ఇప్పటివరకు, ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి వచ్చిన అత్యధిక ప్యాకేజీ సుమారు రూ. 1 కోటి. అది 2017లో వచ్చింది.అయితే 2025 ప్లేస్‌మెంట్లు గత రికార్డులను తిరగరాశాయని చెబుతున్నారు. 2024 తో పోలిస్తే ఈ సారి సగటు వార్షిక వేతనం గణనీయంగా పెరిగిందని సంస్థ ప్లేస్‌మెంట్ విభాగం వెల్లడించింది. 2024లో సగటు ప్యాకేజీ రూ. 20.8 లక్షలు ఉండగా ఈసారి 2025లో ఇది రూ. 36.2 లక్షలకు చేరుకుంది. ఇది 75 శాతం పెరుగుదలని సూచిస్తుందని తెలిపారు. డిసెంబర్‌లో ముగిసిన ప్లేస్‌మెంట్ల తొలి దశలో విద్యార్థులు మొత్తం 24 అంతర్జాతీయ ఆఫర్లను పొందారని యాజమాన్యం వెల్లడించింది.గత 3 సంవత్సరాలలో అత్యధిక ప్యాకేజీలు:సంవత్సరం అత్యధిక ప్యాకేజీ (రూ.)2025-26 2.5 కోట్లు2024-25 66 లక్షలు2023-24 90 లక్షలుఈ గణాంకాలు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల ప్రతిభను, సంస్థ అందిస్తున్న నాణ్యమైన విద్యను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కఠినమైన ఉద్యోగ మార్కెట్‌లో కూడా, సరైన నైపుణ్యాలు, కృషి ఉంటే అద్భుతమైన అవకాశాలు పొందవచ్చని వర్గీస్ ఉదంతం నిరూపిస్తోంది.