రైలు ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న త్వరలోనే పట్టాలపై పరుగులు తీయనున్నాయి. ఇప్పటికే ఈ రైలు ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే తొలి వందేభారత్ స్లీపర్ ప్రయాణించే మార్గంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొత్త ఏడాది ప్రారంభం రోజున కీలక ప్రకటన చేశారు. కోల్‌కతా- గువాహటిల మధ్య ఇది అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. పశ్చిమ్ బెంగాల్‌, అసోం మధ్య నడిచే వందేభారత్ స్లీపర్ ప్రయాణ ఛార్జీలు.. విమాన టికెట్‌ ధరల కంటే తక్కువే ఉంటాయని అన్ని అన్నారు. వాస్తవానికికేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే 15-20 రోజుల్లోనే అందుబాటులోకి రానుందని చెప్పారు. జనవరి 18-19 తేదీల్లో రైలును ప్రారంభించే అవకావం ఉందని అన్నారు. ప్రధాని మోదీకి రైలు ప్రారంభోత్సవం గురించి సమాచారం ఇచ్చామని, రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం కోల్‌కతా- గువహాటి మధ్య విమాన ప్రయాణానికి రూ.6- 8 వేలు ఖర్చవుతోందని మంత్రి చెప్పారు. అదే వందేభారత్‌ స్లీపర్‌లో టిక్కెట్ ధరలు థర్డ్ ఏసీ (ఆహారంతో కలిపి) సుమారు రూ.2,300, సెకెండ్ ఏసీ రూ.3 వేలు, ఫస్ట్ ఏసీ సుమారు రూ.3,600 ఉండొచ్చని మంత్రి తెలిపారు.మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని టికెట్‌ ధరలు నిర్ణయించినట్లు ఆయన వివరించారు. కాగా, ఇటీవల ట్రయల్ రన్‌లో వందేభారత్‌ స్లీపర్‌ గరిష్ఠ వేగం గంటకు 180 కి.మీ. అందుకుంది.. రాజస్థాన్‌లోని కోటా నుంచి మధ్యప్రదేశ్‌లోని నాగ్దా మధ్య రైల్వే భద్రత కమిషనర్‌ సమక్షంలో తుది పరీక్షలను నిర్వహించారు. ఈ సమయంలో రైలు గంటకు 185 కి.మీ. వేగం అందుకోగా... మూడు గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఉంచి ఏమాత్రం తొణకలేదు. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. అత్యాధునిక సౌకర్యాలున్న ఈ రైల్లో మొత్తం 16 భోగీలు ఉంటాయి. స్లీపర్‌ బెర్తులు, అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థ, టాయిలెట్లు, అగ్ని ప్రమాదాలను గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ కెమెరా నిఘా వంటివి ఉంటాయి. కాగా, ప్రస్తుతం ప్రధాన నగరాల మధ్య నడుస్తోన్న సెమీ-హైస్పీడ్ రైళ్లు వందేభారత్ ఛైర్‌కార్‌లో నడుస్తున్నాయి. మోదీ కలల రైళ్లుగా చెప్పుకునే వీటిని తొలిసారిగా 2022లో రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.