మెరుగైన భవిష్యత్తు కోసం , విధి ఆడిన వింత నాటకానికి బలైపోయాడు. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీకి వెళ్లారు. చదువు కొనసాగిస్తున్నారు. బుధవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) హృతిక్ రెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో భయాందోళనకు గురైన హృతిక్ రెడ్డి మంటల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కాపాడుకోవడానికి భవనం పైనుంచి కిందికి దూకేశారు.దురదృష్టవశాత్తు, కిందికి దూకిన సమయంలో ఆయన తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గమధ్యలోనే హృతిక్ రెడ్డి పరిస్థితి విషమించి కన్నుమూశారు. నూతన సంవత్సరారంభంలో కుమారుడి నుంచి శుభాకాంక్షలు వస్తాయని ఆశించిన తల్లిదండ్రులకు, అతను ఇక లేడన్న వార్త పిడుగుపాటులా తగిలింది. హృతిక్ రెడ్డి మరణవార్త మల్కాపూర్ గ్రామంలో విషాద ఛాయలు నింపింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.తమ కుమారుడి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖను కోరుతున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై జర్మనీ పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.కాగా, ఇటీవల అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్లిన మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మేఘన గార్ల మీసేవ నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె కాగా... భావన ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె. మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన తమ బిడ్డలు శవాలై వస్తున్నారన్న వార్తతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.