Income Tax: గత ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేందుకు ఉన్న అన్ని గడువులు ముగిశాయి. సెప్టెంబర్ 16, 2025లోపు ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి దానిని సవరించుకునేందుకు డిసెంబర్ 31, 2025 వరకు అవకాశం ఉంది. దీనిని రివైజ్డ్ ఐటీఆర్ అంటారు. అలాగే డిసెంబర్ 31 వరకు బిలెటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ సమయం ముగిసింది. కొత్త సంవత్సరం 2026 ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం కీలక ప్రకటన చేసింది. ట్యాక్స్ పేయర్లకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ కీలక గణాంకాలు వెల్లడించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో ఏవైనా పొరపాట్లు, తప్పులు ఉంటే సవరించుకుని సరైన ట్యాక్స్ చెల్లించేలా ఐటీ రిటర్నుల్లోని పొరపాట్లు, తప్పులు తనిఖీ చేసుకుని సవరించుకునేందుకు ప్రోత్సహించింది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ట్యాక్స్ పేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది. మొత్తం 48 లక్షలకు పైగా ఐటీ రిటర్నులను సవరించినట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.'నూతన సంవత్సర శుభాకాంక్షలు. NUDGE చొరవలో చురుకైన భాగస్వామానికి పన్ను చెల్లింపుదారులకు పెద్ద ధన్యవాదాలు.22.39 లక్షలకు పైగా అప్డేటెడ్ రిటర్న్స్, 26 లక్షలకు పైగా సవరించిన రిటర్నులు దాఖలయ్యాయి. అంటే మొత్తం 48.3 లక్షలకు పైగా ఆదాయపు పన్ను రిటర్నుల్లో స్వచ్ఛందంగా సవరణలు చేశారు. బలమైన స్వచ్ఛంద సమ్మతికి, వ్యవస్థపై నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. సహకారం బలమైన పన్ను వ్యవస్థను ఎలా నిర్మిస్తుందో మీరు నిరూపించారు. పారదర్శక, బాధ్యతాయుతమైన పన్ను పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో మీ నిరంతర మద్దతును మేము అభినందిస్తున్నాము. 2026లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం. ప్రజల సేవలో ఆదాయపు పన్ను శాఖ' అని ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఎక్స్ వేదికగా తెలిపింది. డిసెంబర్ 31వ తేదీ గడువు ముగిసింది. అయితే, ఇప్పటికీ రీఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ట్యాక్స్ పేయర్లకు ఉంది. సెక్షన్ 154 కింద రెక్టిఫికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను సీపీసీ ప్రాసెస్ చేసిన తర్వాత ఏవైనా పొరపాట్లు ఉన్నట్లు తెలిస్తే వాటిని సవరించేందుకు మాత్రమే వర్తిస్తుంది. ఐటీఆర్‌లో తప్పులు ఉన్నట్లు ప్రాసెస్ అయిన తర్వాత సమాచార నోటీస్ వస్తే వారు రెక్టిఫికేషన్ ఫైల్ చేయవచ్చు.