కొత్త సంవత్సరం వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పాసు పుస్తకాల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 2, శుక్రవారం నుంచి పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మండలాల వారీగా షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి అనగాని సత్య ప్రసాద్ గురువారం నాడు వెల్లడించారు. కొత్త పాస్ పుస్తకాల మీద క్యూఆర్ కోడ్, రాజముద్ర వస్తాయని తెలిపారు. మొత్తం 21.80 లక్షల పాస్ పుస్తకాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో రీసర్వే పూర్తైందని పేర్కొన్నారు.కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జనవరి 2 నుంచి ప్రారంభమై, జనవరి 9 వరకు కొనసాగుతుందన్నారు. గ్రామసభలు నిర్వహించి పాస్ పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. గ్రామ సభల్లో పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు. వెబ్ ల్యాండ్‌లో ఉన్న వివరాల ప్రకారమే, ఎలాంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. అయితే పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు రైతుల వద్ద నుంచి తప్పకుండా వేలి ముద్ర తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఆ పాసు పుస్తకాల్లో తప్పులు ఉంటే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులే స్వయంగా రైతుల ఇళ్లకు వచ్చి తప్పులు సరి చేస్తారని మంత్రి చెప్పుకొచ్చారు. అన్ని జిల్లాల్లో రెవెన్యూ క్లినిక్‌లను విస్తరించి భూ సమస్యలను త్వరగా పరిష్కారిస్తామని తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల ఈ సంవత్సరం భూమి నామ సంవత్సరంగా ఉంటుందని వెల్లడించారు. భూ సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు తప్పు చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.2026వ సంవత్సరం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి సత్య ప్రసాద్ ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు చూపిన మార్గంలో తాము ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి చెందాలని, ఏపీని పున: నిర్మించుకుంటున్నామని తెలిపారు. అన్ని సంక్షేమ పథకాలు అందరికి సక్రమంగా అందాలని తెలిపారు. కొత్త సంవత్సరం నాడే.. 22ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ తాను సంతకం చేశానని మంత్రి చెప్పుకొచ్చారు. 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ నూతన సంవత్సరంలో తొలి సంతకం చేశానని తెలిపారు.