'మంత్రిగా నేను చేయలేని పని, ఈ అమ్మాయి చేసింది'.. ఆటలతో ఏం వస్తుంది అనే వారికి ఇదే సమాధానం!

Wait 5 sec.

ఆటలు కూడు పెడతాయా? ఆకలి తీరుస్తాయా? అని చాలా మంది ప్రశ్నిస్తారు. తమ పిల్లలను ఆటలు ఆడకుండా నిరుత్సాహపరుస్తారు. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన కనువిప్పు. తాజాగా ఏపీ మాజీ మంత్రి, చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల కార్యక్రమంలో రఘువీరా ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళల అంధుల క్రికెట్ టీం కెప్టెన్ దీపికపై ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను చేయని పనిని భారత అంధ క్రికెట్ కెప్టెన్ దీపిక సాధించిందని కొనియాడుతూ చప్పట్లు కొడుతూ దీపికకు కృతజ్ఞతలు తెలియజేశారు రుఘువీరా రెడ్డి. ఈ కొత్త సంవత్సర కార్యక్రమానికి దీపికను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల గ్రౌండ్‌లో సరదాగా దీపికతో రఘువీరారెడ్డి క్రికెట్ ఆడారు. ఆ తర్వాత జరిగిన అభినందన సభలో.. దీపికను సత్కరించారు. ఈ క్రమంలో చిన్ననాటి గురువులకు రఘువీరా పాదాభిషేకం చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. పాత జ్ఞాపకాలను రుఘువీరా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘువీరా రెడ్డి.. గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగినా.. మడకశిర నియోజకవర్గంలోని తంబాలహట్టికు రోడ్డు వేయలేకపోయానని అన్నారు. అయితే తాను చేయలేని పనిని.. క్రికెటర్ దీపిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి తన సొంత గ్రామానికి రూ. 6.5 కోట్ల నిధులతో రోడ్డు మంజూరు చేయించుకుందని కొనియాడారు. ఇటీవల ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టీమ్‌ను ఇటీవల ఉపముఖ్యమంత్రి మంగ‌ళ‌గిరిలోని తన క్యాంప్ కార్యాల‌యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగతంగా వారికి సహాయం చేశారు. తన సొంత డబ్బులతో చెక్కుల‌ను ప‌వ‌న్ కళ్యాణ్ అంద‌జేశారు. వారు సాధించిన విజయానికి అభినందనలు తెలియజేస్తూ.. మ‌హిళా క్రికెట‌ర్లకు ప‌ట్టుచీర‌, శాలువాతో పాటు ప్రత్యేక జ్ఞాపిక‌, కొండ‌ప‌ల్లి బొమ్మలు, అర‌కు కాఫీతో కూడిన వ‌స్తువుల్ని బహుమతిగా ఇచ్చారు. ఈ క్రమంలో కొందరు క్రికెటర్లు తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పవన్‌ను కలిసిన సందర్భంగా అల్లూరి జిల్లాకు చెందిన క్రీడాకారిని క‌రుణ‌ కుమారి.. త‌న గ్రామ సమస్యలను ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా జట్టు కెప్టెన్ దీపిక కూడా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని తెలిపారు. ఆమె సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు. దీంతో ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించడంతో.. ఏళ్ల సమస్య పరిష్కారం అయింది. దీనికి గురించే తాజాగా రఘువీరా రెడ్డి మాట్లాడారు. పూర్తిగా చూపు ఉన్నవాళ్లకే కష్టం అయ్యే.. వరల్డ్ కప్‌ను దీపిక సాధించి చూపించింది. ఆటతో తన సమస్యలనే కాకుండా.. తన గ్రామం సమస్యను కూడా పరిష్కరించింది. ఆటలు కేవలం వ్యక్తిగత వృద్దికే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా దోహదం చేస్తాయని నిరూపించింది.