రోహిత్, కోహ్లి తర్వాత వన్డే ఫార్మాట్‌కు మరణమే.. క్రికెట్ ఫ్యూచర్‌పై సంచలన కామెంట్స్..!

Wait 5 sec.

ఈ తరం క్రికెటర్లలో మేటి ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. వీరిద్దరూ అభిమానులకు షాక్ ఇచ్చారు. అంతకుముందు 2024లో టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించారు. అయితే తాజాగా ఈ ఇద్దరు స్టార్లపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు స్లో డెత్ వస్తుందని హెచ్చరించాడు. ఓ పాడ్ కాస్ట్‌లో అశ్విన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు. తాజాగా అశ్విన్ కామెంట్లు వైరల్‌గా మారాయి.టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. వన్డే క్రికెట్ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలను వ్యక్తం చేశాడు. 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటే.. వన్డే క్రికెట్ మనుగడ కష్టమని అభిప్రాయపడ్డాడు. టీ20 లీగ్‌ల పెరుగుదల, టెస్ట్ క్రికెట్‌తో పోలిస్తే.. 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. "తర్వాత వన్డేల భవిష్యత్తు గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. దాని గురించి నేను కొంచెం ఆందోళన చెందుతున్నాను." అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా, క్రీడలు ఏ ఒక్క వ్యక్తిపై ఆధారపడవని.. కానీ వన్డే క్రికెట్ ఇప్పటికీ ఆ ఫార్మాట్‌లో ఉన్న పెద్ద పెద్ద ఆటగాళ్లపై ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డాడు అశ్విన్. అందుకే సాధ్యమైనంతవరకు వన్డేలలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఆడించాలని.. వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని అశ్విన్ కోరారు. అప్పుడే వన్డే క్రికెట్ మనుగడ సాగిస్తుందని స్పష్టం చేశారు. కాగా, రో-కో ఆడిన ప్రతి మ్యాచ్‌కు ప్రేక్షకుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. వీళ్ళు ఆడని టీ20లు, టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆదరణ తగ్గిపోతోందని వార్తలు వస్తున్నాయి. స్టేడియాలకు వచ్చే అభిమానుల సంఖ్య కూడాతగ్గిపోతోందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అశ్విన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోవైపు, 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అప్పటికి ఈ ఇద్దరు క్రికెటర్ల వయసు దాదాపు 40 సంవత్సరాల వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే 2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా ఇద్దరు స్టార్ క్రికెటర్లు ముందుకు వెళ్తున్నారు.