హైదరాబాద్‌- విజయవాడ హైవేపై టోల్ లేకుండా ఉచిత ప్రయాణం.. కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి లేఖ

Wait 5 sec.

సంక్రాంతి పండుగ వేళ ప్రయాణించే పౌరులకు ఊరటనిచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు టోల్ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. లేఖలో పండుగ ప్రాముఖ్యతను, సామాన్య ప్రజల ఇబ్బందులను మంత్రి వివరించారు. టోల్ వసూళ్ల వల్ల వాహనాలు ఆగిపోవడం వల్ల ఇంధనం వృథా అవ్వడమే కాకుండా, సమయం కూడా వృథా అవుతుందని పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో.. అలాగే తిరుగు ప్రయాణంలో జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌లో టోల్‌ ఫ్రీ ప్రయాణానికి అనుమతివ్వాలని ఆయన కోరారు.పండుగ రోజుల్లో సాధారణం కంటే 200 శాతం అధికంగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని, టోల్ గేట్ల వద్ద వాహనాలు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం సచివాలయంలో ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ, మోర్త్‌ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జనవరి 8 నుంచే వాహనాల తాకిడి మొదలవుతుందని, ప్రయాణికులు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌గేట్ల వద్ద వాహనాలు నేరుగా వెళ్లేలా (టోల్ ఫ్రీ) ఏర్పాట్లు చేయాలని సూచించారు.వాహనదారుల సహాయార్థం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. వైద్య, రెవెన్యూ, పోలీస్, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. అధికారుల అప్రమత్తతను స్వయంగా తనిఖీ చేస్తానని చెబుతూ..అవసరమైతే పండుగ సమయంలో నేనే స్వయంగా మోటార్ సైకిల్‌పై తిరుగుతూ హైవేపై పరిస్థితిని పరిశీలిస్తాని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.