తెలంగాణలో 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ.. డీజీపీ కీలక ప్రకటన

Wait 5 sec.

తెలంగాణ పోలీసు శాఖలో తీపి కబురు. రాష్ట్రంలో దాదాపు 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. చాలా కాలంగా నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది అభ్యర్థుల్లో ఈ ప్రకటన కొత్త ఆశలు చిగురింపజేసింది. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో.. 'తెలంగాణ నేర వార్షిక నివేదిక-2025'ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డీజీపీ ప్రకటనతో త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్న విమర్శలను డీజీపీ కొట్టిపారేశారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం నేరాల సంఖ్య 2.33 శాతం మేర తగ్గుముఖం పట్టిందన్నారు. 2023 నవంబర్ నాటికి రాష్ట్రంలో 2,34,158 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది నవంబర్ నాటికి ఆ సంఖ్య 2,28,695కు తగ్గిందని చెప్పారు. ముఖ్యంగా అల్లర్ల సంఖ్య 42 శాతం తగ్గడం పోలీసుల పనితీరుకు నిదర్శనమని డీజీపీ పేర్కొన్నారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.'రాష్ట్రంలో మొత్తం నేరాలు తగ్గినప్పటికీ.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల ప్రతిష్ఠకు భంగం కలిగించే కేసులు గత ఏడాదితో పోల్చితే 9.02 శాతం పెరిగాయి. 2021లో 4,476 గా ఉన్న ఇటువంటి కేసులు, 2025 నాటికి 6,476కు చేరుకోవడం గమనార్హం. మహిళలపై మొత్తం నేరాల సంఖ్య కూడా 3.16 శాతం పెరిగి 20,551కి చేరింది. అయితే, అత్యాచారాలు, వరకట్న వేధింపులు, కిడ్నాప్‌లు, ఆత్మహత్య ప్రేరణ వంటి కేసులు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. మోసపూరితంగా శారీరక సంబంధం పెట్టుకునే ఉదంతాలపై కొత్తగా అమల్లోకి వచ్చిన బీఎన్‌ఎస్‌ (BNS) సెక్షన్ 69 కింద ఈ ఏడాది 69 కేసులు నమోదు చేశాం. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 41 శాతం పెరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం పోలీసుల ముమ్మర కసరత్తు వల్ల 3 శాతం తగ్గాయి. సైబర్ నేరాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలు దేశస్థాయిలో 6 శాతం తగ్గగా, తెలంగాణలో ఏకంగా 21 శాతం తగ్గుదల నమోదైంది. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) కృషి ఫలితంగా ఈ ఏడాది 24,498 మంది బాధితులకు రూ.159.65 కోట్లను తిరిగి ఇప్పించగలిగారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన 'ఈగల్' బృందం ఈ ఏడాది విశేష ఫలితాలను సాధించింది. సుమారు రూ.172.93 కోట్ల విలువైన డ్రగ్స్‌ను జప్తు చేశారు. ఎన్‌డీపీఎస్ కేసుల నమోదులో 30.36 శాతం పెరుగుదల కనిపించింది, అంటే నిఘా పెరగడం వల్ల నేరస్థులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఇక మావోయిస్టుల విషయానికి వస్తే, తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది 509 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.' అని డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు.