ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన కుమార్తె వివాహాన్ని అత్యంత రహస్యంగా.. కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 26వ తేదీన ఈ వివాహ వేడుక జరిగింది. అసిమ్ మునీర్ మూడో కుమార్తె మహ్నూర్.. తన సొంత బాబాయ్ కుమారుడు (వరుసకు సోదరుడు) అబ్దుల్ రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు. వరుడు అబ్దుల్ రెహమాన్ గతంలో పాక్ ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేశారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ కోటా ద్వారా అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పెళ్లి వేడుకకు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ.. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాక్ దార్, ఐఎస్ఐ చీఫ్, రిటైర్డ్ జనరల్స్, ఆర్మీ మాజీ చీఫ్‌లు హాజరయ్యారు. దాదాపు 400 మంది అతిథులు పాల్గొన్నప్పటికీ.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివాహానికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి రాకుండా అత్యంత జాగ్రత్త పడ్డారు.మరోవైపు.. అసిమ్ మునీర్ నాయకత్వంలో పాకిస్తాన్ తీవ్రవాదం, మతతత్వంలో కూరుకుపోతోందని అంతర్జాతీయ మీడియా తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. పాక్ సైన్యం అనుసరిస్తున్న దౌత్య విధానాల వల్ల అఫ్గానిస్థాన్‌తో సరిహద్దు వివాదాలు ముదురుతున్నాయని.. దేశంలో ఆర్థిక, మానవీయ సంక్షోభం పెరుగుతోందని గ్రీక్ సిటీ టైమ్స్ వంటి పత్రికలు విశ్లేషించాయి. ఒకప్పుడు తాలిబన్లకు మద్దతు పలికిన పాక్ సైన్యం.. ఇప్పుడు వారినే నిందిస్తూ దాడులు చేయడం సరికాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.