తెలంగాణలో మరో నేషనల్ హైవే విస్తరణ.. 4 లైన్లుగా, ఈ మార్గంలోనే..!

Wait 5 sec.

హైదరాబాద్‌-బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-163) విస్తరణ పనులకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. కొన్నేళ్లుగా పర్యావరణ ప్రేమికులు వేసిన కేసు కారణంగా నిలిచిపోయిన సుమారు 46 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు త్వరలో ఊపందుకోనున్నాయి. దీనితో మొయినాబాద్‌-చేవెళ్ల మార్గంలో నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు ఇక తెరపడనుంది.పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కి.మీ మేర కోసం గత ప్రభుత్వ హయాంలో రూ. 920 కోట్లు మంజూరయ్యాయి. అయితే, రోడ్డు విస్తరణలో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు ప్రణవ్, తేజ్ జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)లో కేసు దాఖలు చేయడంతో పనులు నిలిచిపోయాయి. ఈ ఇరుకు రోడ్డు వల్ల మొయినాబాద్ నుంచి చేవెళ్ల వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతూ, వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో అధికారులు రంగంలోకి దిగారు.అధికారులు గత ఏడాది కాలంగా కేసు వేసిన పర్యావరణ ప్రేమికులతో చర్చలు జరిపి, తీసుకునే ప్రణాళికను వివరించారు. దీనితో సంతృప్తి చెందిన పర్యావరణ ప్రేమికులు శుక్రవారం తమిళనాడులోని ఎన్‌జీటీ కోర్టులో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. రోడ్డు విస్తరణకు కోర్టు అనుమతి ఇచ్చినట్లు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య వెల్లడించారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం 950 చెట్లకు సంబంధించి అధికారులు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. 150 చెట్లను రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో నాటించేందుకు అధికారులు హామీ ఇచ్చారు. మిగిలిన చెట్లను రోడ్డుకు మధ్యలో ఉంచడానికి వీలుగా డిజైన్ చేశారు.ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే.. చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే మొయినాబాద్‌-చేవెళ్ల రహదారి విస్తరణ పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి.