Hyd: అయ్యప్ప స్వాములకు మధ్యాహ్నం భిక్షా, రాత్రి అల్పాహార కార్యక్రమం.. లంచ్ బాక్స్‌ కూడా.. ఎక్కడంటే..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో శబరిమల అయ్యప్ప స్వామి మహాదీక్షా కాలం ప్రారంభమైంది. మాలధారణ చేసిన స్వాములకు ఉపశమనం, ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు సమాజ సేవకులు పలుచోట్ల భిక్షా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో.. కేపీహెచ్‌బీ (KPHB) కాలనీలోని శ్రీ పోచమ్మతల్లి గుడి వద్ద అయ్యప్ప భక్తుల కోసం నిత్యాన్నదాన కార్యక్రమం సాగుతోంది. ధర్మ శాస్త్ర భక్త సమాజం ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీన అయ్యప్ప స్వాములకు, భవానీలకు, శివమాలధారులకు అల్పాహారం, భిక్షా కార్యక్రమం మొదలు కాగా.. ఈ కార్యక్రమం జనవరి 10వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. కేపీహెచ్‌బీలో స్వాములకు నిత్యాన్నదానం.. కేపీహెచ్‌బీలోని ఈ నిత్యాన్నదానం కేవలం భోజనం మాత్రమే కాక.. దీక్షా నియమాలను పాటిస్తున్న స్వాములకు పెద్ద ఆసరాగా నిలుస్తోంది. శ్రీ పోచమ్మతల్లి ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో స్వాములు దీక్షా నియమాలకు అనుగుణంగా ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు. రాత్రి సమయంలో కూడా అల్పాహారం అందిస్తున్నారు. దీంతో పాటు.. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ దీక్ష తీసుకున్న స్వాముల కోసం ఉదయం 8 గంటల నుండే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి అందిస్తున్నారు. ఈ సౌకర్యం కార్యాలయాలకు వెళ్లే స్వాములకు నియమాలు భంగం కాకుండా భోజనం అందించడానికి తోడ్పడుతుంది. నియమ నిబంధనలు.. మండల దీక్ష (41 రోజుల దీక్ష)గా పిలిచే ఈ మాలధారణ సాధారణంగా 41 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో స్వాములు అత్యంత కఠినమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అందులో.. నలుపు, నీలం లేదా కాషాయ రంగు దుస్తులు ధరించడం. పాదాలకు చెప్పులు ధరించకుండా ఉండటం. ఆల్కహాల్, మాంసాహారం, పొగాకు వంటి వ్యసనాలకు (Vices) దూరంగా ఉండటం. నేలపై పడక ఏర్పాటు చేసుకుని నిద్రించడం వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి. వీటితో పాటు.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేసి అయ్యప్ప పూజలు, కీర్తనలు నిర్వహిస్తారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామాన్ని నిరంతరం జపిస్తారు. ఈ దీక్ష స్వాములు తమలో భక్తి భావాన్ని పెంపొందించుకోవడానికి అలవరచుకోవడానికి ఉద్దేశించబడింది. మాలధారణ సమయంలో భిక్షాటన, అన్నదానం స్వీకరించడం లేదా నిర్వహించడం ద్వారా భక్తులు స్వామి సేవలో భాగమవుతారు.