ట్రంప్‌పై ప్రశంసలు.. పాకిస్తాన్‌ను అమ్మేశారంటూ షెహబాజ్ షరీఫ్‌పై విమర్శలు

Wait 5 sec.

ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్‌లో జరిగిన గాజా సదస్సులో ప్రధానమంత్రి ప్రవర్తన ఇప్పుడు ఇంటా బయటా తీవ్ర విమర్శలకు కారణం అయింది. ఆ సదస్సులో తన ప్రశంసలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను షెహబాజ్ షరీఫ్ ఆకాశానికి ఎత్తేశారు. ట్రంప్‌ శాంతికాముకుడు అంటూ షరీఫ్ చేసిన పొగడ్తలతో అంతా షాక్ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపినందుకు ట్రంప్‌కు షెహబాజ్ షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈసారి ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై స్పందించిన పాక్ ప్రధాని.. మళ్లీ నామినేట్ చేస్తానని తేల్చి చెప్పారు.దక్షిణాసియాలోనే కాకుండా.. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా లక్షలాది మంది జీవితాలను కాపాడినందుకు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఇక పక్కనే షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపిస్తుంటే.. చిరునవ్వుతో స్పందించిన ట్రంప్.. వావ్, నేను ఇది ఊహించలేదు అని అంటున్నారు. తన ఐదు నిమిషాల ప్రసంగంలో షెహబాజ్ షరీఫ్.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం కృషి చేసినందుకు ట్రంప్‌పై పదే పదే ప్రశంసల వర్షం కురిపించారు. సమకాలీన చరిత్రలో ఇది గొప్ప రోజని.. ఎందుకంటే శాంతికాముకుడైన ట్రంప్ అవిశ్రాంత ప్రయత్నాల వల్ల శాంతి లభించిందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఒకవేళ భారత్-పాక్ వివాదంలో ట్రంప్ జోక్యం చేసుకోకపోయి ఉంటే.. ఏం జరిగిందో చెప్పడానికి ఎవరూ జీవించి ఉండని స్థాయికి రెండు దేశాల మధ్య సైనిక సంఘర్ణ పెరిగి ఉండేదని షెహబాజ్ షరీఫ్ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు. తమ ప్రాంతంలో శాంతిని ప్రోత్సహించడంలో ట్రంప్ చేసిన అద్భుతమైన, అత్యుత్తమ కృషికి గుర్తింపుగా.. ఆయనను నోబెల్ శాంతి బహుమతికి పాకిస్తాన్ నామినేట్ చేసిందని.. అయితే శాంతి పట్ల ట్రంప్‌కు ఉన్న ప్రేమకు మనం చేయగలిగే అతి తక్కువ పని ఇదేనని షరీఫ్ చెప్పుకొచ్చారు.అయితే ట్రంప్‌ను షెహబాజ్ షరీఫ్ అతిగా పొగడటాన్ని పలువురు పాకిస్తానీ రాజకీయ నాయకులు, చరిత్రకారులు, నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించారు. దీనిపై పాకిస్తానీ రాజకీయ నేత, చరిత్రకారుడు అమ్మర్ అలీ జాన్.. ఎక్స్‌లో స్పందించారు. డొనాల్డ్ ట్రంప్‌ను అనవసరంగా షెహబాజ్ షరీఫ్ పొగడటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీయులకు అవమానకరమని పేర్కొన్నారు. ట్రంప్ తన షూ పాలిష్ చేయించుకోవాలని అనుకున్నప్పుడల్లా పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఆహ్వానిస్తాడని.. కాలమిస్ట్ ఎస్ఎల్ కాంతన్ షరీఫ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో ఇంతటి అతిశయోక్తిని తాను ఎప్పుడూ చూడలేదని విమర్శలు గుప్పించారు.షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు, పొగడ్తలు.. 24 కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలకు అవమానకరమని.. నెటిజన్లు పేర్కొంటున్నారు. కొన్ని బిలియన్ డాలర్ల కోసం ఈ తోలుబొమ్మలు (షెహబాజ్ షరీఫ్) పాకిస్తాన్‌ను అమ్మేశారంటూ మరికొందరు నెటిజన్లు ఆరోపించారు. ట్రంప్ మెప్పు పొందేందుకు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్నారు.