ఎడమ చేయిని, కుడి చేతికి అతికించిన.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆపరేషన్

Wait 5 sec.

వైద్య శాస్త్రంలో అద్భుతం జరిగింది. ప్రమాదంలో రెండు చేతులు పోయిన ఓ వ్యక్తికి.. దాదాపు 10 గంటల శ్రమించి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఎడమ చేయిని, కుడి చేతికి అతికించారు. అత్యంత క్లిష్టమైన క్రాస్-హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన సర్జరీ అని డాక్టర్లు చెప్పారు. భారత్‌లో ఇలాంటి శస్త్రచికిత్సల్లో ఇది రెండోదని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిదని వెల్లడించారు. ప్రస్తుతం ఈ శస్త్రచికిత్స చేసిన డాక్టర్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్‌కు చెందిన ఓ కార్మికుడు ధర్మేంద్ర రాజ్ (28) చెన్నైలో పనిచేస్తున్నాడు. గత నెల 26న చెన్నైలోని పార్క్ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతడి రెండు చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎడమ చేయి భుజం నుంచి మోచేతి వరకూ తీవ్ర గాయాలయ్యాయి. కుడిచేయి మణికట్టు వేళ్లన్నీ దెబ్బతిన్నాయి. వెంటనే అతడిని సమీపంలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ (RGGGH) ఆస్పత్రికి తరలించారు. ఎడమ చేయికి.. భుజం నుంచి మోచేయి వరకు తీవ్రంగా గాయమైంది. ఇక కుడిచేయి వేళ్ల నుంచి మణికట్టు వరకు బాగా దెబ్బతింది. అయితే ఎడమ చేయిని సరిచేయడం సాధ్యం కాదని డాక్టర్లు భావించారు. రెండింట్లో ఒక చేయిని తిరిగి అందివ్వాలని అనుకున్నారు. అందులో ఎడమ చేయి.. మణికట్టు నుంచి వేళ్ల వరకు ఉన్న భాగాన్ని.. కుడి చేతికి అతికించారు. అత్యంత క్లిష్టమైన ఈ సర్జరీని డీన్ శాంతారామన్ నేతృత్వంలో దాదాపు 10 గంటలు శ్రమించారు. సర్జరీ తర్వాత అతికించిన చేయికి రక్త ప్రసరన జరగడంతో విజయవంతం అయిందని ప్రకటించారు. ఈ సర్జరీని 14 మంది వైద్యుల బృందం చేసింది. అందులో మహిళా వైద్యులు.. రాజేశ్వరి రషీదా బేగం, వీఎస్ వలార్‌మథి, వి శ్వేత, సోనూ, రాణి, సంతోషిని, జి షణ్ముగప్రియ ఉన్నారు. అయితే సాధారణంగా తెగిపోయిన చేతులను, వేళ్లను అతికించడం చాలా ఆసుపత్రుల్లో జరుగుతుందని.. కానీ ఇలా క్రాస్ హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అత్యంత అరుదు అని వైద్యులు తెలిపారు. భారతదేశంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన మొట్టమొదటి క్రాస్-హ్యాండ్ రీప్లాంటేషన్ ఇదేనని డాక్టర్ రాజేశ్వరి తెలిపారు. ఖర్చు లేదా ఇన్సూరెన్స్ కవరేజ్ పరిమితులను పరిగణనలోకి తీసుకోకుండా.. మా ఆసుపత్రి ఈ మైలురాయిని సాధించిందని చెప్పారు. ఇది తమకు గర్వంగా ఉందని చెప్పారు. అయితే ధర్మేంద్ర రాజ్.. CMCHIS లేదగా PMJAYకి అర్హుడు కాదని.. అయినా సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రారంభంలో కాస్త ట్రామాలోకి వెళ్లినప్పటికీ.. ధర్మేంద్ర ఇప్పుడు బాగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. మానసిక కౌన్సిలింగ్ అందించినట్లు వెల్లడించారు. ఇక ధర్మేంద్రకు ఫిజియోథెరపీ ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. ఫిజియోథెరపీ జరుగుతున్నా కొద్దీ.. అతడి మెదడు కొత్త చేయిని గుర్తిస్తుందని తెలిపారు. ఎందుకంటే, ఎడమ చేతి వేళ్ల నిర్మాణం.. కుడి చేతితో పోలిస్తే చాలా భిన్నం. ఈ తేడాను అర్థం చేసుకునేందుకు మెదడుకు సమయం పడుతుందని చెప్పారు.