తెలంగాణ పత్తి రైతులకు తీపి కబురు. CCI కొనుగోలు కేంద్రాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. జిన్నింగ్ మిల్లుల్లో జాబ్‌వర్క్ టెండర్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకోవడంతో దానిని పూర్తి చేసిన వెంటనే కొనుగోళ్లను మొదలుపెట్టాలని సీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించింది. గతంలో సీసీఐ విధించిన నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిర్వహించిన జాబ్‌వర్క్ టెండర్లలో మిల్లర్లు పాల్గొనలేదు. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకొని సీసీఐ అధికారులతో, మిల్లర్లతో చర్చలు జరిపారు. ఆయన జోక్యంతో వివాదాల పరిష్కారానికి మిల్లర్లు ఒప్పుకోవడంతో, సీసీఐ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 328 మంది కాటన్, జిన్నింగ్ మిల్లుల యజమానులు జాబ్‌వర్క్ టెండర్లలో పాల్గొన్నారు. ఈ టెండర్లను అక్టోబర్ 10న తెరిచారు. జిన్నింగ్ ధరలపై సంప్రదింపులు నేడు జరగనున్నాయి. ఈ సంప్రదింపులు పూర్తయిన వెంటనే మిల్లర్లతో సీసీఐ ఒప్పందం చేసుకోనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల 19 తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టెండర్ల ఆమోదం తర్వాత సంబంధిత జిన్నింగ్ మిల్లుల జాబితాను జిల్లా కలెక్టర్లకు అందిస్తారు. అనంతరం ఆయా మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటిస్తారు.అక్టోబర్ 20, 21 తేదీల్లో దీపావళి, ఇతర నోములు ఉండడంతో ఆ మరుసటి రోజు అంటే 22వ తేదీ నుంచి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని మిల్లర్లు ఇప్పటికే సీసీఐని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో 22న కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పత్తి కొనుగోళ్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సీసీఐ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ అధికారులతో మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా 'కపాస్ కిసాన్' యాప్‌లో సాంకేతిక ఇబ్బందులు రాకుండా చూడాలని, ప్రతి కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని మంత్రి ఆదేశించారు.