త్వరలో అందుబాటులోకి కొత్త రైల్వే వంతెన.. ఇక కష్టాలు తీరినట్లే..!

Wait 5 sec.

కాజీపేటలోని కొత్త రైల్వే వంతెన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రెండో ఆర్క్ నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇరుకైన పాత వంతెనపై పెరుగుతున్న వాహనాల రద్దీతో పాటు అది శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ఈ కొత్త వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ అధికారులు పనులను దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ గుత్తేదారుడిపై వేగం పెంచాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీని ఫలితంగా సుమారు నాలుగు నెలలకు పైగా సమయం తీసుకున్న మొదటి ఆర్క్ పనులతో పోలిస్తే రెండో ఆర్క్ పనులను కేవలం నెల రోజుల్లోపే పూర్తి చేయడం గమనార్హం.పనుల్లో నాణ్యత, వేగం పెంచేందుకు గతంలో కేవలం పది మంది కార్మికులతో మాత్రమే పనులు చేయించగా ప్రస్తుతం అదనంగా 11 మంది నిపుణులను రప్పించారు. దీంతో వెల్డింగ్ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం పాత రైల్వే వంతెనపై రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదలడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం నిత్యకృత్యమైంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించబోయి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టి ప్రమాదాలకు గురవుతున్నారు. పాత వంతెన శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఆర్ అండ్ బీ అధికారులు చేపట్టిన మరమ్మతు పనులు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రయాణికుల కష్టాలు తీరడం లేదు. కొత్త వంతెన నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వస్తేనే హైదరాబాద్‌- హనుమకొండ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్క్ నిర్మాణాలకు సంబంధించిన వెల్డింగ్ పనులు మరో పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు తెలిపారు. తుది మెరుగులు దిద్దడానికి అవసరమైన రెండు లారీలలోని గార్డర్లు ఈ వారంలో చేరుకున్నాయని మరో లారీ గార్డర్లు వస్తే నిర్మాణానికి సరిపోతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వేగంతో పనులు కొనసాగితే, కాజీపేట ప్రజల చిరకాల కల అయిన కొత్త ఆర్వోబీ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.