విజయ్ దేవరకొండ తమ్ముడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. 2019లో 'దొరసాని' అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత నటించిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీ కోవిడ్ కారణంగా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేయబడిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆనంద్ నటించిన మరో మూవీ నేరుగా ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తక్షకుడు’. ఇందులో ‘లాపతా లేడీస్‌’ ఫేమ్ నితాన్షి గోయెల్ హీరోయిన్ గా నటించింది. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' డైరెక్టర్ వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమాని డైరెక్టర్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది అత్యాశతో ప్రారంభమైంది.. తరువాత ప్రతీకారంగా మారింది'' అంటూ ‘తక్షకుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్థులు’ అని పోస్టర్ పై క్యాప్షన్ పెట్టారు. ఇందులో ఆనంద్‌ దేవరకొండ కంబళి కప్పుకొని చేతిలో ఒక తుపాకీ పట్టుకొని ఉన్నాడు. ఆ తుపాకీపై తగలబడుతున్న గుడిసెలు, భయంతో పరుగులు తీస్తున్న జనాలను మనం చూడొచ్చు. చూస్తుంటే ఇది ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఓటీటీ కోసం తీశారో, థియేటర్ కోసం రూపొందించి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారో తెలియదు కానీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.