మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భారత్‌కు రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 330 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అనంతరం ఆస్ట్రేలియా మరో ఓవర్‌ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. భారత్ మూడో ప్లేసులో ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌.. స్మృతి మంధాన (80), ప్రతికా రావల్ (75) రాణించడంతో భారీ స్కోరు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 155 రన్స్ జోడించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో టీమిండియా.. 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. లక్ష్యంగా భారీగా ఉండటంతో ఆది నుంచీ దూకుడుగానే ఆడింది. ముఖ్యంగా కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ అలీసా హెలీ.. భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. 107 బంతుల్లో 142 రన్స్ చేసి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఎలీసా పెర్రీ (47) సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించింది. దీంతో 49 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఓ జట్టు ఛేదించిన అత్యధిక సక్సెస్‌ఫుల్ ఛేజ్ ఇదే కావడం గమనార్హం.ఈ విజయంతో వన్డే వరల్డ్ కప్‌ పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరింది. ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు నమోదు చేసింది. శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మూడు మ్యాచ్‌లలో మూడు విజయాలతో ఇంగ్లాండ్ రెండో ప్లేసులో ఉంది. నాలుగు మ్యాచ్‌లలో రెండు విజయాలు, రెండు ఓటములతో భారత్ మూడో ప్లేసులో ఉంది. దక్షిణాఫ్రికా నాలుగో ప్లేసులో నిలిచింది.