మిత్రుడు దూరమైనా, అతని కుటుంబం కోసం కలిసొచ్చారు.. పెళ్లి పెద్దలుగా మారి కూతురి పెళ్లి చేశారు.. స్నేహమంటే మీదే..

Wait 5 sec.

కనిపెంచిన బిడ్డలకు కన్నోళ్లు.. కట్టుకున్నోళ్లకు భాగస్వామ్యులు బరువు అవుతున్న కాలమిది.. బంధాలంటే బాధ్యత లేక.,. బాధ్యతలు మోసే ధైర్యం లేక.. కుటుంబమంటే లెక్కలేక.. పక్కోడంటే కనికరం లేక.. నిలువెల్లా స్వార్థం.. ఒంటి నిండా విషం నింపుకుని.. ప్లాస్టిక్ నవ్వులతో బతుకుతున్న ఈ రోజుల్లో.. వారు మాత్రం స్నేహానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. స్నేహమంటే బతికున్నప్పుడే కాదని.. బతుకునిచ్చేదని నిరూపించారు. బాల్యమిత్రుడు దూరమైనా.. అతని కుటుంబానికి అండగా నిలిచారు. స్నేహితుడి కుటుంబాన్ని తమ కుటుంబంగా.. ఆ కుటుంబం బాధ్యతలను తమ బాధ్యతలుగా.. వారి బాగోగుల కోసం శ్రమించారు. ఇంటి పెద్ద దూరమై.. వీధినపడిన ఆ కుటుంబానికి ఆ దారి చూపారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన.. నిస్వార్థపు స్నేహానికి నిదర్శనంగా నిలుస్తోంది.. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అనే మాటలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.*చట్టం ప్రభాకర్, శ్రీధర్, చంద్రలాల్, శివకుమార్ రెడ్డి, మృత్యుంజయ, రఘువీర్, రాధాకృష్ణ.. వీరంతా బాల్య మిత్రులు. ఊరు నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నల్లవాగుపల్లె గ్రామం. నంద్యాలలోని శ్రీరామకృష్ణా విద్యాలయంలో వీరంతా చదువుకున్నారు. ఎప్పుడో 1982-83లో పదో తరగతి చదివారు. సాధారణంగా స్కూల్ రోజులు పూర్తై.. కాలేజీలోకి అడుగుపెట్టిన తర్వాత పాఠశాల స్నేహితులు కొద్దికొద్దిగా దూరమవుతూ వస్తారు. కానీ వీరి స్నేహబంధం అలాంటిది కాదు. చదువులు, స్థాయిలు. ఆస్తులు, అంతస్థులు ఇలా ఎన్ని పెరిగినా.. వీరి స్నేహానికి మాత్రం అడ్డంకులు కాలేకపోయాయి. అప్పటి నుంచి ఇప్పటికీ వీరంతా ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ వస్తున్నారు. అయితే 2007లో చట్టం ప్రభాకర్‌ అనారోగ్యంతో మరణించారు.*ప్రభాకర్‌కు భార్య సువర్ణతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇంటి పెద్ద అకస్మాత్తుగా చనిపోవటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఎదిగొచ్చిన కూతుర్లతో ఆ తల్లి ఇబ్బందులు పడింది. అయితే ప్రభాకర్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని మిగతా స్నేహితులు తెలుసుకున్నారు. ప్రభాకర్ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ద్వారా ప్రభాకర్ కుటుంబానికి 2012లో ఐదెకరాల భూమి అందేలా చొరవ తీసుకున్నారు. ఆ భూమిలోనే సువర్ణ వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తూ వచ్చారు. *పెద్ద కూతురు లక్ష్మి డిగ్రీ పూర్తి చేయగా.. చిన్న కుమార్తె ఇంజనీరింగ్ చదువుతోంది. అయితే డిగ్రీ పూర్తి చేసిన లక్ష్మికి శనివారం పెళ్లిని జరిపించారు. ఆళ్లగడ్డ మండలం రామతీర్థం క్షేత్రంలో లక్ష్మి వివాహం జరిగింది. ఈ పెళ్లికి ప్రభాకర్ మిత్రులు పెళ్లిపెద్దలుగా వ్యవహరించారు. పెళ్లి కుమార్తెను పల్లకీ మోసి మండపం వరకూ తీసుకెళ్లడంతోపాటుగా.. స్నేహితుడి కూతురి పెళ్లి పనులన్నీ వారే దగ్గరుండి చేశారు. ప్రభాకర్ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు నిస్వార్థ స్నేహానికి నిలువెత్తు నిదర్శనం వీరంతా అని ప్రశంసిస్తున్నారు.