ఉపాధి హామీ శ్రామికులకు అలర్ట్.. పని కావాలంటే ఇది తప్పనిసరి..!

Wait 5 sec.

గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఏటా వంద రోజుల పాటు పని కల్పిస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు తగ్గేలా, ఉపాధి దొరికేలా చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఉపాధి లేని సమయాల్లో.. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి లభిస్తోంది. అయితే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేపడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు పొందిన వారికి ఈ- కేవైసీ తప్పనిసరి చేసింది. జాబ్ కార్డులు పొందిన ఉపాధి హామీ శ్రామికులు పనుల్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కేవైసీ చేయించుకోకపోతే పనుల్లోకి తీసుకోరని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో దండోరాలు కూడా వేయిస్తున్నారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు ఈ కేవైసీ ప్రక్రియ అక్టోబర్ నెల ప్రారంభం నుంచి మొదలైంది. అక్టోబర్ 19వ తేదీతో ముగియనుంది. అయితే నేెలాఖరు వరకూ పొడిగిస్తారని సమాచారం.ఈ నేపథ్యంలో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఉపాధి హామీ శ్రామికులకు అధికారులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, ఆధార్ కార్డులను ఫీల్డ్ అసిస్టెంట్ల వద్దకు తీసుకెళ్తే.. వారు ఫోటో తీసి సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానిస్తారని చెప్తున్నారు. మరోవైపు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులలో బోగస్ కార్డుల ఏరివేతకు ఈ కేవైసీ తీసుకువచ్చినట్లు తెలిసింది. ఇప్పటి దాకా ఉపాధి హామీ శ్రామిక సంఘాల్లోని పది మందిని కలిపి.. ఓ గ్రూపుగా చేసి వారి ఫోటోలు తీసి అటెండెన్స్ వేస్తూ వచ్చారు. అయితే గ్రూపులోని కూలీలతో పాటుగా ఇతరులను కూడా చూపించి.. దొంగ మస్టర్ల సాయంతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ కేవైసీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే నిజంగా ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు ఎవరో తెలుస్తుంది. అలాగే ఫేసియల్ రికగ్నిషన్ యాప్ సాయంతో పనుల వద్ద వారి హాజరు నమోదు చేస్తారు. అది కూడా పని ప్రదేశంలో ఉపాధి కూలీల ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్‌లో ఫోటో తీసినప్పుడు సరిపోతేనే పనులు కల్పిస్తారు. ఇందుకోసం తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.