గత కొన్నేళ్లుగా తెలంగాణలో బీజేపీకి బలం పెరుగుతోంది. కేవలం ఒక్క ఎమ్మెల్యే నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలతో పార్లమెంట్‌లోనూ గణనీయమైన ప్రాతినిధ్యం ఉంది. అయినా పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం లేదు. ఈ మాట స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి వచ్చింది. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు ఉన్నా.. సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ఎంపీలను ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా.. వెనకబడటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా పార్టీలో అరంతర్గ విబేధాలు వీడి.. సమష్టిగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని ఏంపీలకు సూచించారు. ఈ క్రమంలో అసదుద్దీన్ ఓవైసీని ఉదహరించిన ప్రధాని మోదీ.. ఆయన సోష‌ల్ మీడియా టీమ్ యాక్టి‌వ్‌గా ‌ప‌నిచేస్తోంద‌ని కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఎన్డీఏ ఎంపీల‌తో ప్రధాని మోదీ గురువారం (డిసెంబర్ 11) అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఎంపీలు తీరు మార్చుకోవాలిని సూచించారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల‌ని చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాల‌న బాగుంద‌ని కొనియాడారు. అందుకే ఆ రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌న్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌, ఆయన పార్టీ సోషల్‌ మీడియాలో చేస్తున్న విమర్శలకు కూడా బీజేపీ దీటుగా కౌంటర్‌ ఇవ్వాలని సూచించారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో సరిసమానంగా.. బీజేపీకి ఎంపీలు ఉన్నారు. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలం అవుతున్నారనే విమర్శలు ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నాయి. పార్టీ బలోపేతం విషయంలోనూ రాష్ట్రంలోని పార్టీ పెద్దలు పెద్దగా దృష్టి పెట్టడం లేదని విమర్శలు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ క్లాస్‌తో ఎంపీల పనితీరులో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయో లేదో వేచి చూడాలి. తెలంగాణ బీజేపీలోని ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటెల రాజేంధర్.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ బీజేపీ వర్క్ షాప్ జరిగింది. ఇందులో ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలతో ఆయన మాట్లాడిన ఆయన.. నాయకుల మధ్య గ్యాప్ గురించి ప్రస్తావించారు. లైట్ తీసుకోవద్దని.. ప్రతి విషయం తనకు తెలుసునన్నారు. పార్టీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు చర్యల్లో పడింది కమలదళం.