ఆదుకున్న జియో, టాటా, అదానీ.. 3 రోజుల తర్వాత లాభాల్లోకి మార్కెట్లు.. కలిసొచ్చిన ఫెడ్ నిర్ణయం

Wait 5 sec.

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. వరుసగా మూడు రోజుల నష్టాల నుంచి బయటపడ్డాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా క్రమంలో దేశీయ సూచీలకు కలిసొచ్చింది. ఫెడ్ వడ్డీ రేటు తగ్గించడంతో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలకు అడ్డుకట్ట పడుతుందని మదుపరులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆటో, మెటల్ రంగాల్లోని దిగ్గజ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సైతం కలిసొచ్చింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు రాణించాయి. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లయింది. ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 84,456.75 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగుతూ వచ్చింది. ఒక దశలో 84,906.93 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 427 పాయింట్ల లాభంతో 84,818 వద్ద ముగిసింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ 140 పాయింట్ల లాభంతో 25,898 వద్ద ముగిసింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 90.37 వద్ద అమ్ముడవుతోంది. అయినప్పటికీ మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎటెర్నల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సగటున 2.5 శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ వంటి ప్రధాన కంపెనీల షేర్లు సైతం లాభపడ్డాయి. మరోవైపు.. ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఏషియల్ పేయింట్స్ అత్యధికంగా 0.89 శాతం మేర నష్టపోయింది. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 0.38 శాతం మేర పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 61 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఔన్సుకు 4222 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకే భారత కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. అలాగే అమెరికా టెక్ కంపెనీలు భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ప్రణాళికలు చేస్తున్నాయని సమాచారం. దీంతో స్టాక్ మార్కెట్లలో సానుకూల ప్రభావం పడిందని చెప్పవచ్చు.