Anmol Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి వరుస షాకులు తగులుతున్నాయి. అక్రమ నగదు బదిలీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. , ఆయన కంపెనీల్లోని ఉన్నత పదవుల్లో ఉన్న వారిపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో షాక్ తగిలింది. అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ అనిల్ అంబానీపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 228 కోట్ల మేర నష్టం వాటిల్లేందుకు కారణమైనట్లు ఆ బ్యాంక్ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో యూనియన్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చర్యలు చేపట్టచింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న జై అన్మోల్ అంబానీతో పాటుగా రవీంద్ర శరద్ సుధాకర్‌పైనా కేసు నమోదు చేసింది. ఈ మేరకు సీబీఐ అధికారులు వెల్లడించారు. తిరిగి చెల్లించడంలో ఆ కంపెనీ విఫలమైంది. ఆయా ఖాతాలపై గ్రాంట్ థోర్నంటన్ ఆడిట్ సంస్థ నిర్వహించిన ఫోరెన్సిక్ పరిశీలనలో నిధులను ఇతర మార్గాలకు అక్రమంగా మళ్లించినట్లు తేలింది. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2019 జూన్ 30వ తేదీ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్లను తనిఖీ చేయడంతో లోన్ తీసుకున్న నిధులను ఇతర మార్గాల్లోకి మళ్లించి ఇతర అవసరాలకు వినియోగించుకున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై బ్యాంక్ ఫిర్యాదు చేయడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా చర్యలు చేపట్టింది. అనిల్ అంబానీపై రూ. 17000 కోట్ల ఫ్రాడ్ ఆరోపణలుఅనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌లోని సంస్థలు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం అనిల్ అంబానీపై మనీలాండరింగ్ కేసు పెట్టింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా సహా పలు కంపెనీలు రూ. 17000 కోట్ల మేర నిధులను అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అనిల్ అంబానీకి చెందిన సుమారు రూ. 10 వేల కోట్లు విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.