KCC: కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేసి ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు వివిధ రకాల స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులో ఒకటే (కేసీసీ) పథకం. ఈ పథకాన్ని నాబార్డ్ పర్యవేక్షిస్తోంది. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.3 లక్షలు గా ఉన్న లోన్ పరిమితిని గత బడ్జెట్‌లోనే రూ.5 లక్షలకు పెంచారు. కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవడం ద్వారా 3 శాతం వడ్డీ రాయితీ సైతం ఉంటుంది. తాజాగా ఈ కేసీసీ కార్డులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చిన్న సన్న కారు రైతులకు రూ.1.60 లక్షల వరకు లోన్ ఎలాంటి హామీ లేకుండానే ఇస్తారు. ఈ కార్డు కావాలనుకునే రైతులు బ్యాంకుకు వెళ్లి అప్లై చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఆమోదం పొందిన 15 రోజుల్లోనే రైతులకు కార్డు జారీ చేస్తారు. ఎస్‌బీఐలోనూ ఈ కార్డు అప్లై చేసుకుని తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవచ్చు. తాజాగా కిసాన్ క్రెడిట్ కార్డులపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలోని వివిధ బ్యాంకుల్లో 7.81 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నట్లు చెప్పారు. వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.10.39 లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2.22 కోట్ల కేసీసీ కార్డులు ఉండగా వాటి ద్వారా రూ.4.19 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని వెల్లడించారు. 15 కోట్ల జన్‌ధన్ ఖాతాలు పని చేయట్లే.. ఈ స్కీమ్ ద్వారా మొత్తంగా 57.07 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. అయితే పీఎంజేడీవై కింద ప్రారంభించిన దాదాపు 15.09 కోట్ల బ్యాంకు అకౌంట్లు పని చేయడం లేదని లోక్‌సభ వేదికగా కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇది మొత్తం ఖాతాల్లో 26 శాతానికి సమానంగా తెలిపారు. మరోవైపు.. స్టాండప్ ఇండియా పథకం కింద బ్యాంకులు రూ.62,791 కోట్లు విలువైన 2.75 లక్షల లోన్స్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇందులో ప్రభుత్వ బ్యాంకులు రూ.51,191 కోట్లు విలువైన 2.28 లక్షల లోన్స్ ఇచ్చినట్లు పేర్కొంది. 2025 అక్టోబర్ నాటికి ప్రధాన మంత్రి ముద్రా యోజన ద్వారా రూ.2.54 లక్షల కోట్ల లోన్స్ బ్యాంకులు ఇచ్చాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే ప్రభుత్వ బ్యాంకులు రూ.1.03 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయి.