ట్రంప్ షాకింగ్ ఆఫర్: భారత్, చైనాలతో C5 గ్రూప్‌... G7 ఉనికి ప్రశ్నార్థకం?

Wait 5 sec.

అగ్రరాజ్యం అమెరికా కొత్త జాతీయ భద్రతా వ్యూహం (NSS) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. చైనాను ఎదుర్కోవడంతో పాటు ఐరోపా రక్షణ నుంచి అమెరికా వైదొలగడం వంటివి ప్రస్తావించారు. అయితే, దీనిలో అనేక అంశాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. ముఖ్యంగా ప్రణాళికల్లోని కీలక మార్పులు కూడా ఇందులో ఉన్నాయి. కానీ, C-5 ప్రస్తావన అంతర్జాతీయంగా రక్షణ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. లీకైన పత్రంలో ఐరోపా నుంచి భద్రతాపరంగా అమెరికా వైదొలగడం గురించి పేర్కొన్నప్పటికీ.. ‘మేక్ యూరప్ గ్రేట్ అగైన్’ అనే పేరుతో ఒక రహస్య ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. ఈ పత్రం ప్రకారం.. ఐరోపా ‘సాంస్కృతిక సంక్షోభం’ ఎదుర్కొంటోంది. వలస విధానాలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు దీనికి కారణాలుగా పేర్కొంది. కాబట్టి, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ, పోలాండ్ వంటి దేశాలతో అమెరికా బలమైన సంబంధాలు పెంచుకోవాలని సూచిస్తోంది.C-5 ఏర్పాటు ప్రతిపాదనలు ఎలా?బయటకు వచ్చిన ఎన్ఎస్ఎస్ వ్యూహంలో ప్రపంచ శక్తుల మధ్య అధికార సమతౌల్యం కోసం ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ఉంది. ఆర్థిక లేదా ప్రజాస్వామ్య ప్రమాణాలపై కాకుండా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ఐదు దేశాలైన అమెరికా, చైనా, రష్యా, ఇండియా, జపాన్‌లతో C-5 కూటమిని ఏర్పాటు చేయాలని పేర్కొనడం గమనార్హం. ఈ ప్రణాళిక ప్రకారం, C-5 క్రమం తప్పకుండా సమావేశమై, ప్రధాన భౌగోళిక రాజకీయ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. దీని మొదటి సమావేశం ఎజెండాను కూడా ఖరారు చేశారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని ఎజెండాలో చేర్చారు. అంతేకాకుండా రష్యాను G-8 నుంచి బహిష్కరించడాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. 2014లో ఉక్రెయిన్‌ భూభాగమైన క్రిమియాను ఆక్రమించిన తర్వాత రష్యాను ఈ కూటమి నుంచి బహిష్కరించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడం అసాధ్యమని ట్రంప్ యంత్రాంగం విశ్వసిస్తోంది. ‘‘అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడం సాధ్యం కాదు, తెలివైనది కూడా కాదు’’ అని పత్రం స్పష్టంగా పేర్కొంది. ‘‘ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత జాతీయ ప్రయోజనాలకు ప్రపంచంలో శాశ్వతంగా అమెరికా ఆధిపత్యం అవసరమని అమెరికా విధాన నిర్ణేతలు గుర్తించారు’ అని పత్రం చెబుతుంది. అయితే, ఒక దేశం అమెరికా జాతీయ భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు కలిగిస్తే తప్ప, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఆ పత్రం పేర్కొంది.‘‘ట్రంప్ యంత్రాంగం అనేక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో యుద్ధంతో అశాంతిని వారసత్వంగా పొందింది.. ఈ సంక్షోభాన్ని నివారించడంపై మాకు సహజమైన ఆసక్తి ఉంది’’ అని పత్రం పేర్కొంది. ‘‘ఇది కేవలం అమెరికాపైనే ఆధారపడకూడదు.. అదే సమయంలో చైనా, రష్యాలు అమెరికాను అధిగమించడానికి అనుమతించకూడదు’’ అని నొక్కిచెప్పింది. ప్రపంచ స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రాంతీయ శక్తులను సమన్వయం చేసుకోవాలని సూచించింది. G-7 ఉనికి ప్రశ్నార్థకం?రష్యా వైదొలిగిన తర్వాత, G-7 అమెరికా నాయకత్వంలో పనిచేస్తోంది. ఇది ఒక శక్తివంతమైన సమూహం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది విధానాలను రూపొందిస్తుంది. ఇతర భౌగోళిక రాజకీయ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పుకుంటుంది. కానీ, G-20, బ్రిక్స్ వంటి ప్రభావవంతమైన కూటములు G-7 ప్రభావంపై తీవ్రమైన సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో C-5 ఏర్పడితే G-7ఉనికి ప్రమాదంలో పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. G-7 సమూహంలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే ఉన్నాయి.