తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో , అనర్హుల తొలగింపు చర్యల్లో భాగంగా 2025 అక్టోబర్ నెల వరకు 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు లోక్‌సభ వేదికగా ప్రకటించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా ఈ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంవత్సరాలలో రద్దు చేసిన రేషన్ కార్డుల వివరాలను కేంద్ర మంత్రి సభకు సమర్పించారు. రద్దైన కార్డు వివరాలు ఇలా.. సంవత్సరం రద్దు చేసిన రేషన్ కార్డులు2020 12,1542022 4,988202334,06420243,4242025 (అక్టోబర్ వరకు)1,40,947ఈ లెక్కలను పరిశీలిస్తే.. 2025లో పది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో కార్డుల రద్దు జరిగింది. ఈ విస్తృతమైన తనిఖీ, రద్దు ప్రక్రియ వెనుక రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలు ఆధారంగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమలులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. రద్దుకు గల ప్రధాన కారణాల విషయానికి వస్తే.. రేషన్ కార్డుల రద్దుకు కేవలం ఒకే ఒక్క కారణం కాకుండా.. అనేక అంశాలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. నకిలీ కార్డుల ఏరివేతతో పాటు.. రద్దుకు ప్రధాన కారణాలను కేంద్రం స్పష్టం చేసింది.. అందులో ముఖ్యంగా.. నకిలీ కార్డుల ఏరివేత. ఒకే వ్యక్తి లేదా కుటుంబం పేరిట ఉన్న డబుల్ ఎంట్రీలు, నకిలీ గుర్తింపు కార్డులతో సృష్టించిన కార్డులను తొలగించారు. .. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇతర కారణాల వల్ల రేషన్ పొందేందుకు అనర్హులైన వారి కార్డులను రద్దు చేశారు. కుటుంబ సభ్యుల మరణాలు.. కుటుంబ పెద్ద లేదా ముఖ్య సభ్యులు మరణించడం వల్ల కార్డులు రద్దు చేయడం జరిగింది. శాశ్వత వలసలు.. ఆ కుటుంబం శాశ్వతంగా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన సందర్భాల్లో కార్డులను రద్దు చేశారు. అయితే.. ఈ-కేవైసీ (e-KYC) లేదా ఆధార్ ధ్రువీకరణ పూర్తి కాలేదన్న ఏకైక కారణంతో ఏ ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ ప్రకటన ద్వారా.. కార్డుల రద్దు విషయంలో రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయని.. కేవలం అవకతవకలను నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది.