గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలన విధానంలో తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణ చేపట్టింది. ఇటీవల నగర శివారు 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన సర్కార్.. జీవో జారీ చేసింది. డివిజన్ల క్రమం ఈశాన్యంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి మొదలవుతుంది. దమ్మాయిగూడ జనాభా లక్ష వరకు ఉండటంతో.. అది రెండు డివిజన్లుగా మారుతుంది. గ్రేటర్‌లో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కనీసం రెండు డివిజన్లుగా మారనున్నాయి. త్వరలో ముసాయిదా నోటిఫికేషన్‌ ఇస్తామని.. హద్దులు, ఇతర అంశాలపై వారం రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. అయితే దృష్టిలో ఉంచుకుని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక రాజకీయ వ్యూహానికి తెరలేపినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అనుసరించిన పద్ధతిలోనే.. జీహెచ్‌ఎంసీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా హైదరాబాద్ నగర పాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగానే ఉంది. 2002లో జరిగిన అప్పటి ఎంసీహెచ్ (MCH - 99 వార్డులు) ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైంది.అయితే, 2007లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంసీహెచ్‌ను చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలతో విలీనం చేసి.. ఏకంగా 150 వార్డులతో జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేశారు. ఈ విస్తరణతో అప్పటి వరకు బలంగా ఉన్న టీడీపీ, ఎంఐఎంలు బలహీనపడ్డాయి. ఈ వ్యూహం ఫలితంగా 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లు గెలుచుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇది జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే కాంగ్రెస్‌కు అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.ఆ తర్వాత జరిగిన గత రెండు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. 2016, 2020 ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుని పార్టీ బలహీనపడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వైఎస్సార్ 2007 ఫార్ములాను మళ్లీ అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను ఏకంగా 300 వార్డులకు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నగర పరిధిలో ప్రస్తుతం బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌, బీజేపీ కంచుకోటలను బద్దలు కొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉండగా.. దాని కోసమే కొత్త వార్డులను చేర్చినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ వార్డులను 300కు పెంచడం ద్వారా.. దాని భౌగోళిక విస్తీర్ణం 2,053 చదరపు కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈ విస్తీర్ణంతో జీహెచ్‌ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించనుంది. ఇది ప్రస్తుత అతిపెద్ద కార్పొరేషన్లైన ఢిల్లీ 250 వార్డులు, ముంబై - 227 వార్డులు కంటే కూడా విస్తీర్ణం, వార్డుల సంఖ్యలో పెద్దదిగా మారుతుంది. ఈ విస్తరణ ద్వారా రాబోయే 2026 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును పెంచుకోవాలని.. కొత్తగా విలీనం అయ్యే ప్రాంతాల మద్దతుతో మేయర్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.