IPLపై వసీం అక్రమ్ సెటైర్లు.. బోర్‌ కొడుతుంది! పాకిస్తాన్ సూపర్ లీగ్ నెంబర్ 1 అంటూ స్టేట్‌మెంట్

Wait 5 sec.

పాకిస్తాన్ లెజండ్రీ పేసర్ వసీమ్ అక్రమ్ పీఎస్ఎల్ ప్రమోషన్‌లో ఈవెంట్‌లో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పరోక్షంగా విమర్శలు చేశాడు. ఐపీఎల్‌లో కోచింగ్ స్టాఫ్‌గా, కామెంటేటర్‌గా పనిచేసిన అక్రమ్ ఒక్కసారిగా ఇలా మాట్లాడటంతో నెటిజన్లు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో అక్రమ్‌ని టార్గెట్ చేస్తూ పోస్టులు కూడా చేశారు. "పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) బెస్ట్ విషయం ఏంటంటే 34 -35 రోజుల్లోనే పూర్తవుతుంది. మిగతా లీగ్‌ల్‌లా మూడు నెలలు మాత్రం కాదు. అన్ని రోజులు ఎవ్వరూ ఉండలేరు. అప్పటికి పిల్లలు కూడా పెద్దోళ్లు అవుతారు, అయినప్పటికీ ఆ లీగ్ మాత్రం కంప్లీట్ అవ్వదు. విదేశీ ఆటగాళ్లు కూడా 35 - 40 రోజులు ఉంటే చాలు అంటారు. రెండు - మూడున్నర నెలలు అంటే బోర్‌గా ఉంటుంది. నేను కూడా బోర్‌గా ఫీలవుతాను" అని అక్రమ్ పరోక్షంగా సెటైర్లు విసిరాడు. "విదేశీ ఆటగాళ్లు కూడా పీఎస్ఎల్‌లోని బౌలింగ్ నాణ్యతను గురించి మాట్లాడుతారు. టాలెంట్ పరంగా పీఎస్ఎల్ కచ్చితంగా నెంబర్ వన్" అని అక్రమ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ను నేరుగా విమర్శించకపోయినా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఉన్న బౌలింగ్ టాలెంట్ ప్రపంచంలోనే ది బెస్ట్ అని అక్రమ్ చెప్పాడు. అదే సమయంలో బిగ్ బాష్ లీగ్ కూడా ఎక్కువ రోజులు జరగడంతో ఫెయిల్ అయిందని, ఆ తర్వాత 40 రోజుల లీగ్‌గా మార్చుకున్నారని ఉదాహరణగా చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ పీఎస్ఎల్‌ను ప్రపంచంలో నెంబర్ వన్ లీగ్‌గా చేయడమే తన విజన్ అని చెప్పాడు. అయితే, మొత్తానికి పీఎస్‌ఎల్ ఈవెంట్‌లో అక్రమ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఐపీఎల్‌పై పరోక్షంగా అలాంటి కామెంట్స్ చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 వేలం జనవరిలో జరగనుంది. ఈ వేలానికి ఇప్పటికే చాలా మంది విదేశీ ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. 60 మ్యాచ్‌లు జరిగే పీఎస్ఎల్ 2026 ఏప్రిల్‌లో మొదలై మేలో ముగుస్తుంది.