తిరుపతిలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. తిరుమల దేవస్థానం (టీటీడీ) ఉద్యోగి ఇంటిని దొంగలు గుల్ల చేశారు. దాదాపు 320 గ్రాముల బంగారు నగలతోపాటు.. రూ.10 లక్షలను దొంగిలించారు. దీంతో ఆ ఉద్యోగి.. తిరుపతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. త్వరలోనే ఆ ఉద్యోగి తన బిడ్డ పెళ్లి చేసేందుకు సిద్ధం అవుతుండగా.. ఈ వివాహ ఏర్పాట్లలో భాగంగా కుటుంబం మొత్తం బెంగళూరు వెళ్లారు. ఆ సమయంలోనే దొంగలు.. ఇంటిపై కన్నేసి.. నగలు, డబ్బుతో పరారైనట్లు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.తిరుమల గ్రామీణ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెరుమూలపల్లి పరిధిలో నివసించే.. మురళీ మోహన్.. తిరుచానూరు టీటీడీ కార్యాలయంలో డఫేదారుగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవలె మురళీ మోహన్ కుమార్తె పెళ్లి నిశ్చయం అయింది. త్వరలోనే పెళ్లి ముహూర్తం ఉండటంతో.. వివాహ సంబంధ ఏర్పాట్లలో వారి కుటుంబం బిజీ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల మురళీ మోహన్ భార్య, కుమార్తె పెళ్లి షాపింగ్ కోసం బెంగళూరుకు వెళ్లారు. ఇక రోజూ ఆఫీస్‌కు వెళ్లే మురళీ మోహన్ కూడా ఇంటికి తాళం వేసి.. తిరుచానూరు టీటీడీ ఆఫీస్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గురువారం రోజున ఉదయం మురళీ మోహన్ భార్య, కుమార్తె బెంగళూరు నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో ఇంటి తలుపు తాళం పగిలిపోయి ఉండడం.. తలుపులు కూడా తీసి ఉండటం చూసి షాక్ అయ్యారు. దీంతో మురళీ మోహన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే అతడు ఇంటికి వెళ్లి చూసి.. వెంటనే తిరుపతి గ్రామీణ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మురళీ మోహన్ నివాస పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.మురళీ మోహన్ దాదాపు 320 గ్రాముల బంగారంతోపాటు రూ.10 లక్షల డబ్బును దొంగలు అపహరించారని సీఐ చిన్న గోవిందు వెల్లడించారు. దీంతో స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించి.. దొంగల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుని.. వారి నుంచి డబ్బు, నగలు రికవరీ చేస్తామని పేర్కొన్నారు.