న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన భారత సంతతి ముస్లిం.. ఎవరీ జోహ్రాన్ మందానీ?

Wait 5 sec.

అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో 33 ఏళ్ల విజయం సాధించారు. తద్వారా అమెరికా ఆర్థిక రాజధానికి మేయర్ కాబోతున్న తొలి ముస్లింగా, తొలి భారత సంతతి వ్యక్తిగా, తొలి ఆఫ్రికాలో జన్మించిన వ్యక్తిగా జోహ్రాన్ చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఆండ్రూ క్యువోమోపై ఆయన భారీ తేడాతో విజయం సాధించారు. జనవరి 1న న్యూయార్క్ మేయర్‌గా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. గత వందేళ్లలో పదవికి ఎన్నికైన పిన్న వయస్కుడు జోహ్రాన్ కావడం విశేషం.బోర్డ్ ఆఫ్ ఎలెక్షన్స్ ప్రకారం.. 20 లక్షల మందికిపైగా న్యూయార్క్ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటేశారు. 1969 తర్వాత మేయర్ ఎన్నికల్లో నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదే కావడం గమనార్హం. మమ్దానీ తన ప్రచారం అంతటా.. డొనాల్డ్ ట్రంప్ సహా రిపబ్లికన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ట్రంప్ ఆయనపై ‘కమ్యూనిస్ట్’ అనే ముద్ర వేశారు. జోహ్రాన్ గెలిస్తే న్యూయార్క్‌ను తాను చేజిక్కించుకుంటానని కూడా ట్రంప్ బెదిరించారు. జోహ్రాన్ 2018 నుంచి అమెరికా పౌరుడైనప్పటికీ, న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ చేయడానికి ఆయనకున్న అర్హతలను ట్రంప్ ప్రశ్నించారు.రచయిత & దర్శకురాలు మీరా నాయర్, విద్యావేత్త మహమూద్ మమ్దానీ దంపతులకు జోహ్రాన్ 1991లో జన్మించారు. ఆఫ్రికా దేశమైన ఉంగాడా రాజధాని కంపాలాలో జన్మించిన జోహ్రాన్.. తర్వాత కొంత కాలం దక్షిణాఫ్రికాలో పెరిగారు. జోహ్రాన్‌కు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన కుటుంబం అమెరికాలో స్థిరపడింది. దీంతో అప్పటి నుంచి ఆయన క్వీన్స్‌లోనే పెరిగారు. ‘‘నేను క్వీన్స్‌లో పెరిగాను, నేనెప్పుడూ క్వీన్స్‌కు చెందినవాడిని’’ అంటూ ట్రంప్ విమర్శలకు జోహ్రాన్ గట్టిగా బదులిచ్చారు.న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక అసమానతలను తగ్గించడానికి కృషి చేస్తానని ఎన్నికల ప్రచారంలో జోహ్రాన్ హామీ ఇచ్చారు. సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సబ్ వే ఛార్జీలపై నియంత్రణతోపాటు రవాణా సదుపాయల విస్తరణకు వేగంగా చర్యలు తీసుకోవడం లాంటివి ఆయన ప్రచారంలో కీలక హామీలు. అద్దెలను తగ్గించడం, ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం, ఆహార ధరలను తగ్గించడానికి నగర కార్పొరేషన్ ఆధ్వరంలో నడిపే కిరాణా షాపులను ప్రారంభించడం, ధనవంతులపై పన్నులు పెంచడం లాంటివి ఆయన ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.తన విధానాలు, ముస్లిం వారసత్వంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యాపార ప్రముఖులు, సంప్రదాయవాద మీడియా నుంచి దాడులను ఎదుర్కొన్నప్పటికీ మమ్దానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. న్యూయార్క్ మేయర్ పోటీలో నల్లజాతీయులు, హిస్పానిక్, ఆసియా ఓటర్లు ఆయన పట్ల మొగ్గు చూపుతున్నట్లు 2025 మధ్యలో నిర్వహించిన ఓ పోల్‌లో వెల్లడైంది.అల్ జజీరా మీడియా సంస్థ కథనం ప్రకారం.. 2020లో మమ్దానీ అప్పటికే నాలుగుసార్లు ఎన్నికైన అభ్యర్థిని ఎదుర్కొని క్వీన్స్‌లోని 36వ అసెంబ్లీ జిల్లాకు డెమోక్రటిక్ ప్రైమరీని గెలుచుకున్నారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీలో సేవలందించిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా, ఉగాండాలో జన్మించిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. షియా ముస్లిం అయిన జోహ్రానీ.. సిరియాలో జన్మించిన రమా దువాజీని ఇటీవల వివాహం చేసుకున్నారు, ఈమె రచనలు ది న్యూయార్కర్, ది వాషింగ్టన్ పోస్ట్ లాంటి వాటిల్లో ప్రచురితం అయ్యాయి. జోహ్రాన్ దంపతులు క్వీన్స్‌లోని ఆస్టోరియాలో నివసిస్తున్నారు.జోహ్రాన్ తల్లిదండ్రుల గురించి మరికొంత..జోహ్రాన్ మమ్దానీ తండ్రి మహమూద్ మమ్దానీ ఒక విద్యావేత్త. ఉగాండాకు చెందిన పండితుడైన మహమూద్‌కు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆయన 1946లో బాంబేలో జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన పీహెచ్‌డీ చేశారు. కొలంబియా యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ బోధిస్తున్నారు. జోహ్రాన్ తల్లి మీరా నాయర్ రూర్కేలాలోని హిందూ కుటుంబంలో జన్మించారు. దర్శకురాలైన ఆమె కూడా హార్వర్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆమె దర్శకత్వం వహించిన సలాం బాంబే చిత్రానికి 1988లో కేన్స్‌లో Caméra d’Or లభించింది. ఈ చిత్రం అకాడమీ నామినేషన్ కూడా పొందింది.