హమ్మయ్య నిరీక్షణ ఫలించింది.. హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్, ఇక తగ్గేదేలే..!

Wait 5 sec.

హైదరాబాద్‌- విజయవాడల మధ్య ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, వేగవంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం 65వ జాతీయ రహదారి (NH-65) విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ రహదారిలో 40వ కిలోమీటరు నుంచి 269వ కిలోమీటరు వరకు... మొత్తం 229 కిలోమీటర్ల పొడవున విస్తరించనున్నారు. ఈ విస్తరణకు అవసరమైన భూమిని సేకరించడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి, రవాణా శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో 9 గ్రామాల్లో భూసేకరణ చేపట్టే బాధ్యతలను అక్కడి ఆర్డీవోలకు అప్పగించారు. అదేవిధంగా.. నల్గొండ జిల్లాలోని చిట్యాలలో 5, నార్కెట్‌పల్లిలో 5, కట్టంగూర్‌లో 4, నకిరేకల్‌లో 2, కేతేపల్లిలో 4 గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. సూర్యాపేట జిల్లా పరిధిలో.. సూర్యాపేట మండలంలో 4, చివ్వెంలలో 6, కోదాడ మండలంలో 4, మునగాల మండలంలో 5 గ్రామాల్లో భూసేకరణ బాధ్యతలను కూడా ఆర్డీవోలకు అప్పగించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో 4, కంచికచర్లలో 4, జగ్గయ్యపేటలో 7, పెనుగంచిప్రోలులో 3, ఇబ్రహీంపట్నంలో 12, విజయవాడ రూరల్‌లో 1, విజయవాడ వెస్ట్‌లో 2, విజయవాడ నార్త్‌ పరిధిలోని ఒక గ్రామంలో భూసేకరణ చేపట్టే బాధ్యతలను అక్కడి జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. ఈ భూసేకరణ ప్రక్రియ వేగవంతమైతే, త్వరలోనే రహదారి విస్తరణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల నివారణ చర్యలు..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత ముఖ్యమైన ఈ రహదారిపై నిత్యం రద్దీ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతూ రక్తసిక్తమవుతోంది. ముఖ్యంగా ఎల్‌బీనగర్ నుంచి అవుటర్ రింగ్‌రోడ్ (ORR) వరకు స్థానిక ట్రాఫిక్ కూడా హైవేపైకి వచ్చి రద్దీని పెంచుతోంది. ఈ నేపథ్యంలో.. విస్తరణలో భాగంగా అధికారులు ఇప్పటికే 17 బ్లాక్‌స్పాట్‌లను (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు) గుర్తించారు. రూ. 325 కోట్ల వ్యయంతో ఈ బ్లాక్‌స్పాట్‌ల వద్ద ప్రత్యేకంగా అండర్‌పాస్‌లు, వెహిక్యులర్ అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, సర్వీసు రోడ్లు నిర్మించేందుకు పనులు చేపట్టారు. చౌటుప్పల్, చిట్యాల వంటి ప్రాంతాల్లో బ్లాక్‌స్పాట్‌లను సరిచేయడానికి జంక్షన్ల మెరుగుదల, లేన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి.భవిష్యత్తు రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ రహదారిని పూర్తిగా తీర్చిదిద్దేందుకు రూ. 10,391.53 కోట్ల భారీ వ్యయంతో విస్తరణ చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో రామపురం క్రాస్ వంటి ప్రమాదకర జంక్షన్ల వద్ద అండర్‌పాస్‌లు, పాలేరు వాగుపై కొత్త వంతెన నిర్మాణాలు, అలాగే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్ వరకూ 5.5 కిలోమీటర్ల మేర 8 వరుసలతో డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ నూతన నిర్మాణాలు పూర్తయితే.. విజయవాడ-హైదరాబాద్‌ల మధ్య ప్రయాణ సమయం 2 గంటల మేర తగ్గుతుందని అంచనా. కేంద్ర రహదారి, రవాణా శాఖ నోటిఫికేషన్ మేరకు తెలంగాణ, ఏపీల్లోని పలు మండలాల పరిధిలో భూసేకరణ పనులు వేగవంతం కానున్నాయి.