తెలంగాణలో పోటీ చేయడానికి ఉన్న 'ఇద్దరు పిల్లల' నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది, దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు మార్గం సుగమం అవుతుంది.భారతదేశంలో కుటుంబ నియంత్రణ చర్యలను ప్రోత్సహించే ఉద్దేశంతో.. ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థలు (గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ), పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్రంలో 1994లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నిబంధన 1995 మే 31 నుంచి అమలులోకి వచ్చింది. ఈ నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018, పురపాలక చట్టం 2019లను సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీకి గత నెల 23న జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీర్మానించింది.ఈ నిబంధన కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా అనేకమంది రాజకీయంగా చురుకైన వ్యక్తులు స్థానిక ప్రజాప్రతినిధులుగా మారే అవకాశాన్ని కోల్పోయారు. ముఖ్యంగా, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం, సమర్థ నాయకత్వానికి ఈ నిబంధన ఆటంకంగా ఉందని భావించిన ప్రభుత్వం.. ఈ ఎన్నికలలో పౌరులందరికీ సమాన అవకాశం కల్పించే ఉద్దేశంతో సవరణ చేపట్టింది. మంత్రిమండలి తీర్మానం తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను అదే నెల 24న గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అంశంపై న్యాయసలహా తీసుకున్న తరువాత.. తాజాగా దీనికి ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, నగరపాలక, పురపాలక ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా ఇకపై స్వేచ్ఛగా పోటీ చేయడానికి అవకాశం ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలుఇక పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆర్‌.సురేందర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని అధికరణ 243(ఇ) ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఎన్నికల సంఘం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎందుకు ఎదురుచూస్తోందని ప్రశ్నించింది. పంచాయతీ పాలకవర్గాల గడువు గత ఏడాది జనవరిలోనే ముగిసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 24కు వాయిదా వేసింది.